హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సి కళ్యాణ్ గెలుపొందారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతల మండలి ఎన్నికల నిర్వహించాల్సి ఉండగా.. ఈ సారి చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు నేడు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సి. కళ్యాణ్ ప్యానల్, పి. రామకృష్ణ గౌడ్ ప్యానల్లు తలపడ్డాయి. నిర్మాతలు సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. మొత్తంగా 477 ఓట్లు పోలవగా, సి కళ్యాణ్కు 378, ఆర్కే గౌడ్కు 95 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. తక్కువ సంఖ్యలో ఓట్లు రావడంతో ఆర్కే గౌడ్ డిపాజిట్ కోల్పోయారు.