నాన్నతో ఓకేనా?

9 Jan, 2020 09:06 IST|Sakshi

తండ్రి విక్రమ్‌తో కలిసి నటించడానికి యువ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ రెడీ అవుతున్నాడా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు విక్రమ్‌ తన కొడుకు ధ్రువ్‌ విక్రమ్‌ను ఆదిత్యవర్మ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. కాగా తన కొడుకు తొలి చిత్రం విషయంలో విక్రమ్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతగా అంటే ముందుగా బాలా దర్శకత్వంలో రూపొందించిన వర్మ చిత్రం సంతృప్తిగా  రాలేదని ఆ చిత్రాన్ని పక్కన పెట్టించి మరోసారి అర్జున్‌రెడ్డి చిత్రానికి పనిచేసిన అసోసియేట్‌ను దర్శకుడిగా పరిచయం చేసి అదే చిత్రాన్ని ఆదిత్యవర్మ పేరుతో పూర్తిగా రీషూట్‌ చేయించుకున్నారు.

ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో విక్రమ్‌ స్పాట్‌లోనే ఉన్నారు. ఈ విషయాన్ని నటుడు ధ్రువ్‌విక్రమ్‌నే తెలిపారు. అంత శ్రద్ధ తీసుకుని చేసినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే నటుడిగా ధ్రువ్‌విక్రమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కాగా ధ్రువ్‌విక్రమ్‌ చిత్రం ఏమిటన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. అయితే విక్రమ్‌ తన కొడుకుతో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకోసం మంచి కథను తయారు చేయమని తన సన్నిహిత దర్శకులకు చెప్పారు. అలా దర్శకుడు వెట్రిమారన్‌ విక్రమ్, ధ్రువ్‌విక్రమ్‌లకు ఒక కథను సిద్ధం చేశారట.

ఈ విషయాన్ని ధ్రువ్‌విక్రమ్‌నే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ కథను తాను ఇంకా వినలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తండ్రీకొడుకులు కలిసి నటించడానికి కథ రెడీ అయ్యిందని, దీన్ని ఒక ప్రముఖ దర్శకుడు సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విక్రమ్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా చిత్రంతో పాటు, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన కొడుకుతో కలిసి నటించే చిత్రం ఉంటే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు