అరుణాచలం దర్బార్‌

8 Nov, 2019 03:18 IST|Sakshi
రజినీకాంత్‌

రజినీకాంత్‌ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్‌ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్‌’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్‌ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

‘దర్బార్‌’ సినిమా తెలుగు మోషన్‌ పోస్టర్‌ని గురువారం హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్‌ సార్‌ నటించిన ‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్‌ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు మహేశ్‌బాబు. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్‌లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ని తమిళ్‌లో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్‌ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్‌ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్‌’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు