హీరోయిన్‌ కన్నీళ్లు

30 Sep, 2017 11:27 IST|Sakshi

చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ అందరి ముందు ఓ హీరోయిన్‌ను కడిగిపారేశారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో యువనటి ధన్షికపై శివాలెత్తిపోయారు. ధన్షిక ప్రసంగంలో తన పేరు ప్రస్తావించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంత పొగరంటూ దుర్భాషలాడినంత పనిచేశారు. పొరపాటున మరచిపోయానని చెప్పినా రాజేందర్ లక్ష్యపెట్టలేదు. సారీ చెప్పినా కనికరించలేదు. దీంతో ధన్షిక వేదికపైనే కన్నీటి పర్యంతమయింది.

రాజేందర్-ధన్షిక వివాదానికి ‘విళితిరు’ చిత్ర  ప్రెస్‌మీట్ వేదికైంది. చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ధన్షిక సినిమా గురించి మాట్లాడింది. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరి గురించి ప్రస్తావించింది. కానీ సినిమాలో ఓ పాట పాడిన రాజేందర్‌ పేరు చెప్పడం మరచిపోయింది. దీన్ని అవమానంగా భావించిన రాజేందర్‌.. స్టేజ్‌పైనే ఆగ్రహం ప్రదర్శించారు. కబాలి చిత్రంలో రజినీకాంత్‌తో నటించి మాత్రాన హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని చురకలంటించారు. సహచర ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని గద్దించారు. పెద్ద ఆర్టిస్టులకు గౌరవించకపోతే భవిష్యత్‌ ఉండదని హెచ్చరిస్తూ ఆమె వైఖరిని కఠినంగా తప్పుబట్టారు.

స్టేజ్‌పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని, అంతేతప్ప కావాలని చేసింది కాదని ధన్షిక ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. రాజేందర్‌ వైఖరితో ఖిన్నురాలైన ఆమె మౌనంగా ఉండిపోయింది. హీరో శింబు తండ్రి అయిన రాజేందర్‌ గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
 

మరిన్ని వార్తలు