నచ్చిన నటుడితో మరోసారి..

25 Mar, 2020 09:26 IST|Sakshi

కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ జంటలోకి విజయ్, కాజల్‌అగర్వాల్‌ కూడా వస్తారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి నటించిన జిల్లా, తుపాకీ, మెర్శల్‌ వంటి చిత్రాలు విజయాలను పొందాయి. కాగా తాజాగా మరోసారి కలిసి నటించడానికి ఈ జంట సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. దీన్ని నటి కాజల్‌అగర్వాల్‌నే స్వయంగా చెప్పింది. విజయ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం మాస్టర్‌. నటి మాళవికామోహన్‌ ఆయనకు జంటగా నటిస్తున్న ఇందులో నటుడు విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ముందుగానే ప్రకటించింది. అయితే కరోనా ప్రభావం కారణంగా ఈ చిత్ర విడుదల తేదీ వాయిదా పడుతుందా అనే సందేహం కలుగుతోంది. చిత్ర వర్గాలు మాత్రం అనుకున్నట్లుగానే మాస్టర్‌ చిత్రాన్ని విడుదల చేస్తామంటున్నారు. కాగా నటుడు విజయ్‌ తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు.

మరోసారి ఆయన  దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌తో చేతులు కలపనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తుపాకీ, కత్తి, సర్కార్‌ చిత్రాలతో సంచలన విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందన్నమాట. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఇకపోతే ఇది నటుడు విజయ్‌కు 65వ చిత్రం అవుతుంది. ఇది తుపాకీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కాజల్‌అగర్వాల్‌ తాను నటుడు విజయ్‌తో మరోసారి కలిసి నటించనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఇండియన్‌–2 చిత్రంలో కమలహాసన్‌తోనూ, దుల్కర్‌సల్మాన్‌కు జంటగా ఒక చిత్రంలోనూ నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అందులో  తనకు బాగా నచ్చిన నటుడు దళపతి విజయ్‌ అని పేర్కొంది. తాము త్వరలో మరోసారి కలిసి నటించనున్నట్లు చెప్పింది. దీంతో తుపాకీ–2లో ఈ అమ్మడు విజయ్‌తో మరోసారి రొమాన్స్‌ చేయనుందని భావించాల్సి ఉంది. ఎందుకంటే తుపాకీ చిత్రంలో ఈ బ్యూటీనే హీరోయిన్‌. దీంతో దాని సీక్వెల్‌లోనూ కాజల్‌అగర్వాల్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకుని ఉంటారని భావించవచ్చు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 

మరిన్ని వార్తలు