చెన్నై : కరోనా వైరస్ పై పోరాటంలో తాను సైతం అంటూ ముందుకొచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే చాలాసార్లు సూచించిన కమల్ హాసన్ తాజాగా కరోనా కష్ట కాలంలో ప్రజలందరిని అప్రమత్తం చేసేందుకు స్వయంగా పాట రాసి పాడారు. అరివుమ్ అన్భుమ్ పేరుతో ఒక పాటను విడుదల చేశారు. అరివుమ్ అన్భుమ్ అంటే తెలుగులో బుద్ది, ప్రేమ అని అర్ధం. ఈ పాటను కమల్ కేవలం రెండు గంటల్లో రాయడం మరో విశేషం.
పాటలో పోలీసులు, వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల త్యాగాలని చూపిస్తూ వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు కమల్. ఇక ఈ పాటకు జిబ్రాన్ సంగీతం అందించగా కమల్తో 12 మంది ప్రముఖులు తమ గొంతు కలిపారు. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ తదితరులు ఈ పాటలో ఉన్నారు. వీరంతా తమ ఇళ్లవద్దనే ఉండి ఈ పాటను రికార్డ్ చేశారు. 'అరివుమ్ అన్బుమ్'అంటూ సాగిన ఈ పాటలో కిలో మీటర్ల దూరం పిల్లలతో కలిసి నడిచి వెళుతున్న బాధని వివరించారు కమల్. ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేసిన తక్కువ సమయంలోనే 20 లక్షల వ్యూస్వైపు దూసుకుపోతోంది.