ఇద్దరు అగ్రనటులు 20 ఏళ్ల తర్వాత..

29 Mar, 2017 16:33 IST|Sakshi
ఇద్దరు అగ్రనటులు 20 ఏళ్ల తర్వాత..

తిరువనంతపురం: అగ్రనటులు మోహన్‌లాల్‌, ప్రకాశ్‌రాజ్‌ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరో భారీ బడ్జెట్‌ సినిమా రూపుదిద్దుకోనుంది. చివరిసారిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్వకత్వంలో ఇరవయ్యేళ్ల కిందట ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌లాల్‌ కలిసి ‘ఇరువార్‌’ అనే చిత్రంలో నటించారు. పాలక్కాడ్‌ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ‘ఒడియాన్‌’  టైటిల్‌తో రానున్న ఈ మలయాళ సినిమా ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీలో మోహన్‌లాల్‌ సరసన మంజు వారియర్‌ నటించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లోనూ మూవీ విడుదల చేస్తారు. అంతేకాదు, ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

కేరళ పాలక్కాడ్‌-మలబార్‌ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ఈ సినిమా నడుస్తుంది. ఈ గిరిజనులకు మనుషులు, జంతువులు ఇలా ఏ రూపంలోకైనా మారే అద్భుత శక్తులుంటాయని.. ఇదివరకు ఎవరూ వినని కథనమని డైరెక్టర్‌ వీఏ శ్రీకుమార్ మీనన్‌ చెప్పారు. పాలక్కాడ్‌, థజారక్‌, పొల్లాచి, వారణాసి, హైదరాబాద్‌ ప్రాంతాలలో షూటింగ్‌ చేస్తామన్నారు. నవంబర్‌లో ఒడియాన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆశీర్వాద్‌ బ్యానర్‌లో మే 25 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాకు కథ రచయిత హరికృష్ణ కాగా, ఆంటోనీ పెరుంబువూర్‌ మూవీని నిర్మిస్తారని సమాచారం.