జంధ్యాలగారిలా క్లీన్ మూవీస్ చేయాలనేది నా లక్ష్యం

19 Dec, 2013 00:34 IST|Sakshi
మేర్లపాక గాంధీ

ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతరమే. అందుకే దర్శక, నిర్మాతలు యూత్‌నే టార్గెట్ చేస్తున్నారు. కొందరైతే, కుర్రకారుని వలలో వేసుకోడానికి ద్వందార్థ సంభాషణలకు కూడా తెగబడుతున్నారు. కానీ.. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. దాన్ని యువతరం సినిమా అనలేం, కుటుంబ కథాచిత్రం అని కూడా అనలేం. పోనీ ప్రేమకథ అందామా! అంటే.. అది కూడా కరెక్ట్ కాదు. అది అందరి కథ, అందరికీ నచ్చే కథ. అశ్లీలత అనేది మచ్చుకైనా కనిపించని కథ. అదే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. తొలి సినిమాతోనే... అందరి మనసుల్నీ దోచేసిన ఆ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ...
 ఇండస్ట్రీలో హిట్ రాగానే... నిర్మాతలు అడ్వాన్సులతో ముంచెత్తేస్తారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అడ్వాన్సులు అందుకుంటున్నారా?
 నా పరిస్థితి అచ్చం మీరు చెప్పినట్టే ఉంది. అయితే.. అడ్వాన్సులు మాత్రం అందుకోవడం లేదు. ‘నా తొలి సినిమా ప్రమోషన్ పనులే ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడే నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించలేను’ అని గట్టిగా చెప్పేస్తున్నా. కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా. నా తర్వాత సినిమా ఏంటో త్వరలో తెలియజేస్తా.
 కథ రెడీగా ఉందా?
 ప్రస్తుతం అదే పనిలో ఉన్నా. కథ ఓ కొలిక్కి వచ్చింది. ఇది కూడా తొలి సినిమా లాగా భిన్నమైన కథాంశమే. లిటిల్‌బిట్ జర్నీ కూడా ఉంటుంది. ప్రేమ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది.
 కొందరు దర్శకులు ఎఫర్ట్ మొత్తం తొలి సినిమాకే పెట్టేస్తున్నారు. మలి సినిమాకొచ్చేసరికి దెబ్బ తింటున్నారు. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు?
 కథ ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలి. స్క్రీన్‌ప్లే ఇంటిలిజెంట్‌గా ఉండాలి. ‘వీడు ఏదో గమ్మత్తు చేశాడ్రా’ అనిపించాలి. అలా ఉంటే విజయం తథ్యం. యువతరం చూస్తున్నారు కదా.. అని ప్రేమకథల వెంటే పడకూడదు... ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్లాలనేది నా అభిమతం. సాధ్యమైనంత వరకూ నా సినిమాల్లో హ్యూమర్, మెసేజ్ ఉండేలా చూసుకుంటాను. జంధ్యాలగారు తీసిన సినిమాల్లా క్లీన్ మూవీస్ తీయాలనేది నా లక్ష్యం. నాకు తొలి విజయం కంటే మలి విజయమే ఇంపార్టెంట్.
 మీ నాన్నగారు మేర్లపాక మురళి రచయిత కదా. ఆయన ప్రభావం మీపై ఎంత?
 చాలా ఉంది.  కళలపట్ల ఆసక్తి నాకు ఆయన నుంచే సంక్రమించింది. చిన్నప్పట్నుంచీ నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు నాన్న. బుక్ కంప్లీట్ చేస్తే ఇరవై రూపాయలు ఇచ్చేవారు. పోనుపోనూ పుస్తకాలు చదవడం నాకు వ్యసనంలా మారింది. చివరకు నేనే ఆయనకు డబ్బులిచ్చి పుస్తకాలు తెమ్మనేవాణ్ణి. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ, తిలక్ ఇలా మహామహుల పుస్తకాలు చదివేశాను.
 అనుకోకుండా డెరైక్టర్ అయ్యారా? లేక మీ లక్ష్యం కూడా ఇదేనా?
 నా లక్ష్యం ఇదే. ఇంటర్ టైమ్‌లోనే డెరైక్టర్‌ని అవుతానని నాన్నతో చెప్పాను. ‘బీటెక్ పూర్తి చేశాక నీ ఇష్టం వచ్చినట్లు చేయ్’ అన్నారాయన. ఆళ్లగడ్డలో ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ చేశాను. కోర్స్ పూర్తవ్వగానే, అన్నమాట ప్రకారం చెన్నయ్ ఎల్వీప్రసాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు నాన్న. అయితే, డెరైక్షన్ కోర్స్ అంటే సెల్ఫ్ సెక్యూరిటీ ఉండదని నాన్న ఫీలింగ్. అందుకే.. నాన్న కోసం సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాను. కానీ, ఎక్కువగా డెరైక్షన్ క్లాసుల్లోనే ఉండేవాణ్ణి.
 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం ఎలా వచ్చింది?
 చెన్నయ్‌లో కోర్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రాగానే.. ‘ఖర్మరా దేవుడా’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ చిత్రోత్సవాలో బెస్ట్ షార్ట్‌ఫిలింగా ఎంపికైంది. దర్శకుడు హరీష్‌శంకర్ చేతులపై  జ్ఞాపిక అందుకున్నాను. తర్వాత తన సినిమాకు పనిచేయమని హరీష్ అడిగారు. కలుద్దామనుకునేలోపు ఆయన ఫారిన్ వెళ్లిపోయారు. ఈ గ్యాప్‌లో  తయారు చేసుకున్న ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను సందీప్‌కిషన్‌కి చెప్పాను. తనకు బాగా నచ్చేసింది. తనే కథ వినిపించమని నన్ను పలువురు నిర్మాతల వద్దకు పంపారు. కథ అయితే.. అందరికీ నచ్చేది కానీ, సందీప్ అనగానే.. బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని భయపడేవారు. ఓసారి మా ఊరు రేణిగుంటలో ఉండగా, ‘చోటా కె.నాయుడు కథ వింటారట’ రమ్మని సందీప్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి చోటాగారికి కథ చెప్పాను. ఆయనకు కథ తెగ నచ్చేసింది. వెంటనే.. జెమినీ కిరణ్‌గారికి చెప్పించారు. ఆయనకూ నచ్చడంతో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కింది.
 ఈ సినిమా విడుదలవ్వగానే మీకు దక్కిన గొప్ప కాంప్లిమెంట్?
 సినిమా విడుదలైన రోజు  ఓ ఫిలిం జర్నలిస్ట్ అన్నారు.. ‘నేను మంచి దర్శకుల మీద ఇటీవలే ఓ బుక్ రాశాను. మీ సినిమా నెల రోజులు ముందు విడుదలైనట్లయితే... నా బుక్‌లో మీరూ ఉండేవారు’ అని. ఈ సినిమా విషయంలో ఎన్ని ప్రశంసలు దక్కినా... ఆయన అన్నమాట మాత్రం నాకు అమితానందాన్నిచ్చింది.