జీవా సరసన మిల్కీబ్యూటీ

17 Feb, 2016 03:39 IST|Sakshi
జీవా సరసన మిల్కీబ్యూటీ

మిల్కీబ్యూటీ తమన్నాకు కోలీవుడ్‌లో మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఆ మధ్య సూర్యతో రొమాన్స్ చేసిన అయన్ చిత్రం, ఆ తరువాత అజిత్‌కు జంటగా నటించిన వీరం చిత్రం తమన్నాకు మంచి విజయాలను అందించాయి. అయినా ఇక్కడ అవకాశాలు దోబూచులాడాయి. అయితే బాహుబలి చిత్రం తరువాత తమన్నాకు తెలుగులో కంటే తమిళంలోనే దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వరించగా తాజాగా నటుడు జీవాలో జతకట్టే అవకాశం తలుపు తట్టింది.

జీవా ఇప్పటికే వరుసగా తిరునాళ్ చిత్రంలో నయనతారతో, పోకిరిరాజా చిత్రంలో హన్సికతో,కవలై వేండామ్ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు తమన్నాతో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మైఖెల్ రాయప్పన్ తన గ్లోబల్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన జయంరవి, లక్ష్మీమీనన్ జంటగా నిర్మించిన మిరుదన్ చిత్రం ఈ నెల 19న తెరపైకి రానుంది.

జీవా హీరోగా నటించనున్న చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు కాళీశ్వరన్ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఇందులో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.  తమన్నా నటించిన ద్విభాషా చిత్రం తోళా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.