ఆనందంగా ఉంది కానీ..

24 Nov, 2019 16:57 IST|Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో.  బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌ కీలక ప్రాతలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ‘సామజ వరగమన, రాములో రాములా, ఓ మై గాడ్‌.. డాడీ’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా చిత్ర బృందం ఎప్పటికప్పడూ అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా పూజా హెగ్దే షూటింగ్‌ లోకేషన్‌లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఇది ఒక కుటుంబ కథ చిత్రం. ఇలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ ఈ ఫొటోలో మిస్‌ అయ్యార’ని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై సుశాంత్‌ స్పందించారు. ‘నేను కూడా మీ అందర్ని మిస్‌ అవుతున్నాన’ని ట్వీట్‌ చేశాడు. అలాగే ఈ చిత్రంలోని ‘సామజ వరగమన’యూట్యూబ్‌లో వన్‌ మిలియన్‌ లైక్‌లు సాధించి సరికొత్త రికార్డు సాధించడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు