మరో టీవీ నటిపై రాహుల్ ఆరోపణలు..

9 May, 2016 20:40 IST|Sakshi
మరో టీవీనటిపై రాహుల్ ఆరోపణలు..

ముంబై: టీవీనటి ప్రత్యూష్ బెనర్జీ అనుమానాస్పద మరణం  కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనపడ్డం లేదు.   ఆమె చనిపోయి దాదాపు నెల రోజులు దాటినా రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా ఆమె ప్రియుడు,  ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ సింగ్  మరో టీవీ నటి కామ్యా పంజాబీపై ఆరోపణలు గుప్పించాడు.  ఆమె ప్రత్యూష దగ్గర  అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని ఆరోపించాడు. ప్రత్యూష ఆత్మహత్య కేసులో తన స్నేహితులు చెప్పిందంతా అబద్ధమని పేర్కొన్నాడు. ప్రత్యూష బెనర్జీ దగ్గరనుంచి కామ్యా పంజాబి  రెండున్నర లక్షలు అప్పుగా తీసుకుందని, అవి తిరిగి వెనక్కి ఇవ్వలేదని విమర్శించాడు.

అయితే ఈ ఆరోపణలను  కామ్యా   తిరస్కరించింది. రాహుల్ పూర్తిగా తప్పుడు వాదనలు చేస్తున్నాడంటూ కొట్టి పారేసింది. బీసీఎల్ సీజన్ లో తాను జైపూర్ రాజ్ జోషిలే టీంకు యజమానిగా ఉన్నానని తెలిపింది.  ఆ సమయంలో తన టీంకు  ప్రత్యూష్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిందని కామ్యా తెలిపింది.  ఈ క్రమంలో  ప్ర్యతూష తండ్రి ఎన్జీవో ప్రమోషన్ లో భాగంగా తనకు రెండున్నర లక్షలు ఇచ్చిందని  తెలిపింది. ఆ సమయంలో ఇద్దరం అనేక మీడియా ఇంటర్వ్యూ ల్లో పాల్గొన్నామని పేర్కొంది. దీనికి  సంబంధించిన తన దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. ఇది జరిగి సుమారు మూడేళ్లు అయిందనీ, అప్పటికీ  ప్రత్యూష్ జీవితంలోకి అసలు రాహుల్ ప్రవేశించనే లేదని స్పష్టం చేసింది.  ఇప్పటికైనా రాహుల్ నిజాలు చెప్పాలని డిమాండ్ చేసింది.


కాగా గత ఏప్రిల్ 1 బాలికా వధు గా బుల్లితెరకు సుపరిచితమైన ప్రత్యూష బెనర్జీ  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.  మరి కామ్యా వివరణపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.