బాలాజీతో ప్రియాఆనంద్‌ రొమాన్స్‌

25 May, 2018 09:05 IST|Sakshi

తమిళసినిమా: రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఏవరైనా నాయకుడు కావచ్చు. సినిమాల్లో ఎవరైనా కథానాయకుడు కావచ్చు. ఆ విధంగా కథానాయకుడిగా మారిన హాస్యనటుల పట్టికలో తాజాగా ఆర్‌జే.బాలాజీ చేరుతున్నాడు. చక్కని ఉచ్చరింపు, ఆకట్టుకునే అభినయం వంటి ప్లస్‌ పాయింట్స్‌తో అనతికాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయిన నటుడు ఆర్‌కే.బాలాజీ. ఇతనిప్పుడు ఎల్‌కేజీ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇది రాజకీయ సెట్టైరికల్‌ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అట.వేల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాక్టర్‌ కే.గణేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్‌జే.బాలాజీకి జంటగా నటి ప్రియాఆనంద్‌ నటిస్తోంది.

ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త అయిన నాంజల్‌ సంపత్‌ ముఖ్య పాత్ర ద్వారా నటుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆర్‌జే.బాలాజీ తెలుపుతూ ఈ తరం యువతకు రాజకీయాల గురించి తెలియనివి ఉండవనే చెప్పవచ్చునన్నారు. బ్రేకింగ్‌ న్యూస్‌ అనే కాలంలో జీవిస్తున్న యువతకు రాజకీయాల గురించి, రాజకీయనాయకుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అధికం అవుతోందన్నారు. అలాంటి వారి కోసమే ఈ ఎల్‌కేజీ చిత్రం అని చెప్పారు. ఇందులో తనకు తండ్రిగా నాంజల్‌ సంపత్‌ నటిస్తున్నారని తెలిపారు. నేటి యువతరంలో నాంజిల్‌ సంపత్‌కు మంచి పేరు ఉందన్నారు. అదేవిధంగా తనకు చిరకాల స్నేహితురాలైన ప్రియాఆనంద్‌ నటిగా కంటే కూడా అధిక అక్కర చూపిస్తూ ఈ చిత్రంలో నటించడం ప్రశంసనీయం అన్నారు. ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్‌ సంగీతాన్ని, మేయాద మాన్‌ చిత్ర ఫేమ్‌ విదు ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఈ ఎల్‌కేజీ చిత్రం రాజకీయ సెట్టైరికల్‌తో పాటు అన్ని వర్గాలను రంజింపజేసే సన్నివేశాలతో కూడి ఉంటుందని ఆర్‌జే.బాలాజీ చెప్పారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు