మధురమైన జ్ఞాపకం

14 Apr, 2020 03:33 IST|Sakshi
పిల్లలు ఇచ్చిన గ్రీటింగ్‌ కార్డ్‌తో...

‘‘మా పదో వివాహ వార్షికోత్సవం కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరిగింది’’ అన్నారు రంభ. ఈ వేడుకల గురించి ఓ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారామె ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేను, నా భర్త (ఇంద్రకుమార్‌) మా పిల్లల (కుమార్తెలు లాణ్య, సాషా, కుమారుడు శివన్‌) సమక్షంలో మా వివాహ వార్షికోత్సవాన్ని ఇంట్లోనే చేసుకున్నాం. ఈ వేడుకలో మా బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. అయినప్పటికీ ఇది మా జీవితాల్లోనే ఒక మధురమైన వేడుక అని చెప్పగలను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలను పంచిందీ వేడుక.

ఒకొరికొకరం సాయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లూ మేమే చేసుకున్నాం. ఆర్డర్‌ చేయకుండా మా కేక్‌ను మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. ఈ కేక్‌లోని ప్రతి చిన్న భాగంలోనూ మా పదేళ్ల ప్రేమ దాగి ఉంది. మా కుమార్తెలు లాణ్య, సాషా మాకు ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ గ్రీటింగ్‌ కార్డ్‌ను బహుమతిగా ఇచ్చి మా ఆనందాన్ని మరింత పెంచారు. ఈ సెల్ఫ్‌ క్వారంటైన్‌ సమయంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబంతో సమయాన్ని గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని పేర్కొన్నారు రంభ. 1992 నుంచి 2010 వరకు నటిగా వెండితెరపై సత్తా చాటారు రంభ. ఆ తర్వాత బుల్లితెర షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించారామె. 2010 ఏప్రిల్‌ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను రంభ వివాహం చేసుకున్నారు.

ఫ్యామిలీతో రంభ

మరిన్ని వార్తలు