‘వైద్య వృత్తిని వదులుకున్నా’

28 Mar, 2018 10:15 IST|Sakshi
సాయి పల్లవి

తమిళసినిమా: సినిమా కోసం కష్టపడి చదివిన వైద్య వృత్తిని వదులుకున్నానని అంటోంది సాయిపల్లవి. నటిగా మలయాళంలో సక్సెస్‌ అయ్యి ఆ తరువాత తెలుగు చిత్రసీమలో విజయాలను అందుకుని ఆ తరువాతే తమిళ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ అమ్మాయి ఈ భామ. అయితే మాలీవుడ్‌లో నటించిన ప్రేమమ్‌ చిత్రమే ఈ అమ్మడి తొలి చిత్రం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అది నిజం కాదన్న విషయాన్ని సాయిపల్లవి తనకు తానే బయటపెట్టింది. ఆ కథేంటో చూద్దాం. 

ఇంతకుముందు తమిళంలో ధామ్‌ ధూమ్‌ చిత్రంలో కంగణాకు స్నేహితురాలిగా, కస్తూరిమాన్‌ అనే మలయాళ చిత్రంలో మీరా జాస్మిన్‌కు స్నేహితురాలిగా నటించాను. అయితే సినిమా శాశ్వతం కాదని, హీరోయిన్ల కాలపరిమితి ఐదారేళ్లే అని తన తండ్రి చెప్పారన్నారు. చదువే మంచి భవిష్యత్తునిస్తుందని తను ఎంబీబీఎస్‌ చదివించేందుకు జార్జియా  పంపారన్నారు. 

జార్జియాలో చదువుతుండగానే ప్రేమమ్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. దీంతో చదువుకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నటించమని అమ్మానాన్న చెప్పారు. అలా నటించిన ప్రేమమ్‌ చిత్రం ఘన విజయం సాధించడంతో సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించాను. దీంతో వృత్తిని వదులుకోవలసివచ్చింది. అందుకే పూర్తిస్థాయి నటిగా మారిపోయాను. అయితే దేవుడి దయవల్ల  ఈ స్థాయికి చేరుకున్నాను అని సాయిపల్లవి అంది. ఈ అమ్మడు  తొలి తమిళ చిత్రం కరు త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

మరిన్ని వార్తలు