రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా షాలినీ పాండే

11 Dec, 2019 12:36 IST|Sakshi

ముంబై : తన తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’తో బోల్‌‍్డ నటిగా పేరు తెచ్చుకున్న షాలినీ పాండే బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించే అవకాశం ఆమెకు దక్కింది. రణ్‌వీర్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ఫిల్మ్స్ షాలినీని కూడా హిందీ తెరకు పరిచయం చేయనుండటం విశేషం. ఈ విషయాన్ని యశ్‌రాజ్‌ఫిల్మ్స్ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. దివ్యాంగ్‌ థక్కర్‌ దర్శకత్వంలో తాము నిర్మిస్తున్న జయేష్‌భాయ్‌ జోర్దార్‌ సినిమాలో షాలినీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా విజయ్‌ దేవరకొండ- షాలినీ పాండే జంటగా తెరకెక్కిన అర్జున్‌రెడ్డి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంచనాలతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా హిందీలో కబీర్‌సింగ్‌గా రీమేక్‌ అయ్యింది.

ఇక జయేష్‌ భాయ్‌ జోర్దార్‌ సినిమా విషయానికొస్తే.. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలని భావించే ఓ మధ్యతరగతి వ్యక్తికి పితృస్వామ్య వ్యవస్థలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి రణ్‌వీర్‌ మాట్లాడుతూ... ‘ మనస్ఫూర్తిగా నవ్వాలంటే.. అందుకోసం ఒక్కోసారి నువ్వు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ సినిమాలో జయేశ్‌ భాయ్‌ హీరోలా కనిపించడు. తనొక సాధారణ వ్యక్తి. సున్నిత మనస్కుడు‌. పితృస్వామ్య వ్యవస్థ సిద్ధాంతాలు, ఆచారాలకు వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులు ఉండాలని భావిస్తుంటాడు. నటుడిగా నాకు ఈ పాత్ర ఒక సవాల్‌’ అని చెప్పుకొచ్చాడు. 


 

మరిన్ని వార్తలు