సరికొత్త ఫార్మాట్ లో తెలుగు చిత్రరాజం

25 Aug, 2014 09:31 IST|Sakshi
సరికొత్త ఫార్మాట్ లో తెలుగు చిత్రరాజం

తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ సినిమా 35 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదలవుతోంది. డిజిటలైజ్ చేసి మళ్లీ ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులద్దారు.

కలర్ కరెక్షన్ చేసి సినిమాను స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా పాత నోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఈ చిత్రరాజాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దాదాపు ఏడాది కష్టపడి ఈ చిత్రానికి సరికొత్త వన్నెలు అద్దారు. 

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో నాలుగు జాతీయ అవార్డులు గెల్చుకుంది. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు.