ఆ రోజు మళ్లీ రాదు..!

29 Sep, 2014 23:25 IST|Sakshi
ఆ రోజు మళ్లీ రాదు..!

‘‘ప్రేమ గాయానికి మందు లేదు. కాలగమనంలో ఎన్ని విజయాలు అందుకున్నా, ఎన్ని శిఖరాలు అధిరోహించినా... ప్రేమ గాయం తాలూకు బాధ మాత్రం అంతర్లీనంగా బాధిస్తూనే ఉంటుంది. బతికున్నంతవరకూ వేధిస్తూనే ఉంటుంది. దూరమైన మనసు కోసం గాలిస్తూనే ఉంటుంది. దానికి కాలంతో పని లేదు... సింపుల్‌గా మా చిత్రకథ ఇదే’’ అంటున్నారు దర్శకుడు క్రాంతిమాధవ్. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే పేరును ఖరారు చేశారు.
 
  కేఎస్ రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘సీతాకోకచిలుక, అభినందన, గీతాంజలి, ప్రేమ... 80ల్లో వచ్చిన ఈ సినిమాలన్నీ మనసుల్ని మెలిపెట్టే ప్రేమకథలే. ఇప్పుడు అలాంటి ప్రేమకథలు రావడం లేదు. మా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రం ఆ లోటును భర్తీ చేస్తుంది. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతోన్న ఈ చిత్రానికి స్క్రిప్ట్ ప్రధాన బలం. సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు అందించారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు.