తొలిసారి నువ్వు నా పక్కన లేవు..

9 Dec, 2018 10:08 IST|Sakshi

కన్నడ సీనియర్‌ నటుడు అంబరీష్‌ మరణం నుంచి ఆయన కుటుంబం, సాండల్‌వుడ్ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేకపోతున్నారు. శనివారం తమ పెళ్లి రోజు కావటంతో అంబరీష్‌తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకొని సుమలత భావోద్వేగానికి లోనయ్యారు. తన భావలను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ‘మా మనసు నిండా నీవే... 27 ఏళ్ల పాటు మీతో గడిపిన క్షణాలు మరిచిపోలేనివి, అనుక్షణం నీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాము’ అంటూ తమ 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఆవేదనతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు.

‘‘డిసెంబరు 8 మన పెళ్లి రోజు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి నువ్వు నా పక్కన లేవు.. నా ప్రపంచంలో నువ్వు ఓ కేంద్రం మాత్రమే కాదు.. నా పూర్తి ప్రపంచమే నువ్వు. నా చేయి పట్టుకుని నడిపించిన చేయి నీది.. నాకు అమితమైన ప్రేమను పంచిన హృదయం నీది. నువ్వు నన్ను ప్రేమించిన తర్వాతే నా జీవితం ప్రారంభమైంది. నీ ప్రేమ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. నువ్వు ఎక్కడున్నప్పటికీ ఇంకా నన్ను చూస్తున్నావని నాకు తెలుసు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘అంబి మా చేయి పట్టి నడిపించావు... నీ నగుమోము మాకు ఎంతో ఇష్టం, ఎన్ని యుగాలైనా మరచిపోము. నీవెక్కడ ఉన్నా మా కోసమే వెతుకుతుంటావు, నీ కుమారుడికి ఇకపై నీవే రక్షణగా నిలబడాలి, అభిమానుల్లో మిమ్ములను చూసుకుంటున్నాను’ అంటూ అంబరీశ్‌పై ఉన్న ప్రేమను సుమలత తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 27 ఏళ్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సుమలత రాసిన లేఖను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు