‘బిగ్‌ బి’ని కోలీవుడ్‌ తీసుకొస్తారా?

9 Jan, 2018 21:05 IST|Sakshi

2018లో స్పీడ్‌ పెంచేసిన సూర్య తన 37వ చిత్రానికి రెడీ అయిపోయారు. గత రెండేళ్లుగా సూర్య నటించిన ఒక్కో చిత్రమే తెరపైకి వస్తోంది. 2017లో ఎస్‌–3 చిత్రం మాత్రమే విడుదలైంది. ఈ ఏడాది ఆరంభంలో తానాసేర్న్‌దకూట్టం సంక్రాంతికి బరిలో దిగుతోంది. నటి కీర్తీసురేశ్‌ నాయకిగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని డ్రీమ్‌వారియర్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రారంభ దశలోనే సూర్య మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ఆయన ఇటీవల తానాసేర్న్‌దకూట్టం చిత్ర ప్రచార వేదికపై వెల్లడించారు. 

సూర్య, కేవీ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో ఇప్పటికే అయన్, మాట్రాన్‌ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడిస్తారని సూర్య పేర్కొన్నారు. ఈ భారీ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

అమితాబ్‌బచ్చన్‌ ఇప్పటి వరకూ కోలీవుడ్‌లో నటించలేదు. టాలీవుడ్‌లో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంతో పరిచయం అవుతున్నారు. మరి కేవీ.ఆనంద్, సూర్య ఆయన్ని కోలీవుడ్‌కు తీసుకొస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇకపోతే సూర్య 24 చిత్రం ఫేమ్‌ విక్రమ్‌కుమార్, సింగం ఫేమ్‌ హరి దర్శకత్వంలోనూ మరో సారి నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. 

మరిన్ని వార్తలు