త్వరలోనే హీరోయిన్‌తో సుశాంత్‌ పెళ్లి!?

23 Aug, 2019 20:07 IST|Sakshi

‘ఎంఎస్‌ ధోని’ ఫేమ్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సుశాంత్‌ ప్రస్తుతం హీరోయిన్ రియా చక్రవర్తితో డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి తరచుగా డిన్నర్లకు, పార్టీలకు వెళ్తూ ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. దీంతో ఈ జంట తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో సుశాంత్‌ సన్నిహితుడు ఒకరు ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ..రియాతో తనకున్న బంధాన్ని సుశాంత్‌ ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడు వివాహానికి సిద్ధంగా ఉన్నాడని..త్వరలోనే ఈ విషయం గురించి రియాతో చర్చించనున్నట్లు చెప్పాడన్నాడు. అయితే రియా మాత్రం ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి సారించాలనుకుంటోందని.. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనట్లుగా అనిపిస్తుందన్నాడు. 

ఈ క్రమంలో కొంత సమయం తీసుకున్నా సరే..ఆమె నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే సుశాంత్‌-రియాల పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చాడు. కాగా బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన సుశాంత్‌..‘కాయ్‌ పోచే’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశాడు. గతంలో టీవీ నటి అంకితా లోఖండేను ప్రేమించిన సుశాంత్‌ ఆమెకు బ్రేకప్‌ చెప్పాడు. అనంతరం కొన్నాళ్లపాటు హీరోయిన్‌ కృతి సనన్‌తో సన్నిహితంగా మెలిగాడు. ఇక ప్రస్తుతం రియాతో అతడు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు బీ-టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. కాగా సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాతో రియా చక్రవర్తి టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు