లక్నో : కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటంబాన్ని క్వారంటైన్కు తరలిస్తుండగా, వైద్యులు, పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి మృతి చెందిన అనంతరం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా కుటుంబ సభ్యులను కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్కు తరలించేంకు వైద్య సిబ్బంది, వారి ఎస్కార్ట్ కోసం పోలీసు సిబ్బంది వెళ్లారు. దీంతో కొంతమంది స్థానికులు గుమిగూడి వారిపై రాళ్ల దాడి చేశారు. పోలీసు వాహనంపై కూడా రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన దృశ్యాలు సీసీటీవి ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. ఇలాంటి కేసుల్లో నిందితులపై జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసిన వారితోనే డబ్బులు వసూలుచేస్తారు.
"కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో అతడి కుటుంసభ్యులను క్వారంటైన్కు తరలించేందుకు వెళ్లిన వైద్య సిబ్బంది, పోలీసులపై 150 మందితో ఓ గుంపు దాడి చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను ఎంత మాత్రం ఉపక్షించేది లేదు." అని సీనియర్ పోలీసు అధికారి అమిత్ పాథక్ అన్నారు. కరోనాపై పోరాటంలో ఎంతో కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులపై దాడిచేసిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఇక మొరాదాబాద్లో 19 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.