పనులు ప్రారంభమయ్యాయి కానీ..

5 May, 2020 04:40 IST|Sakshi
అస్సాంలో లాక్‌డౌన్‌ సడలింపుతో గువాహటిలో దుకాణం తెరుస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జోన్‌ల వారీగా మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో.. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇతర పలు చేతి వృత్తుల నిపుణులు తమ పనులు ప్రారంభించారు. ముఖ్యంగా, వేసవి కాలం ప్రారంభమై, భానుడు ప్రతాపం చూపుతుండటంతో ఏసీలు, కూలర్ల సర్వీసింగ్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు నెలన్నరగా వాయిదా పడిన గృహ సంబంధ పనులన్నీ ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకునేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు.

పనులు చేసుకునేందుకు అనుమతిన్విడమే కాకుండా.. సంబంధిత స్పేర్‌ సామాన్లు అమ్మే షాపులు కూడా తెరిచేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీకి చెందిన ఒక ఎలక్ట్రీషియన్‌ వ్యాఖ్యానించారు. ప్రతీ ఏప్రిల్‌లో ఏసీ రిపేర్, సర్వీసింగ్‌ల ద్వారా కనీసం రూ. 40 వేలు సంపాదించేవాడినని, ఈ సారి కరోనా కారణంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని వాపోయారు. ఢిల్లీలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు.. తదితర అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 6 లక్షల వరకు ఉంటారని అంచనా. అయితే, కరోనా వ్యాప్తిపై భయాందోళనల కారణంగా చాలా మంది పౌరులు ఇంట్లో మరమ్మత్తు పనుల కోసం బయటి నుంచి ఎవరినీ పిలిచేందుకు సాహసించడం లేదు.
 

మరిన్ని వార్తలు