పది లక్షలు దాటిన కేసులు

17 Jul, 2020 09:48 IST|Sakshi

మొత్తం మరణాల సంఖ్య 25,602

రికార్డు స్థాయిలో రికవరీ  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి  మరింత వేగంగా  విస్తరిస్తోంది.  తాజాగా దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 34,956  కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 10,03,832 కు చేరింది.  మరోవైపు మరణాల సంఖ్య 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే  రికవరీ రికార్డు స్థాయిలో పెరిగింది. 24 గంటల్లో 22,942  బాధితులు కోలుకున్నారు.

కాగా దేశంలో తొలి  కోవిడ్‌-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనే బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది. దేశంలో కరోనా కేసుల్లో  మహారాష్ట్ర టాప్‌ లో ఉండగా,  తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక  ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 2 లక్షల 84,281 మందికి కరోనా వైరస్ సోకగా, ఇప్పటివరకు 11,194మంది ప్రాణాలు విడిచారు. తమిళనాడులో లక్షా 56,369 కరోనా కేసులు 2,236 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 51,422 మంది కరోనా సోకగా 1,032 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఢిల్లీలో లక్షా 18,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,545మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ లో 35,159 మందికి కరోనా వైరస్ సోకగా 492 మంది చనిపోయారు. తెలంగాణలో 41,018కి చేరుకోగా 396 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు