శాకాహారమే తీసుకోవాలి: అదంతా ఫేక్‌!

15 May, 2020 14:11 IST|Sakshi

ఐసీఎంఆర్‌ రూల్స్‌ పేరిట ఫార్వర్డ్‌ అవుతున్న ఫేక్‌ మెసేజ్‌ 

న్యూఢిల్లీ:  సాధారణ సమయాల్లోనే కాదు విపత్కర పరిస్థితుల్లోనూ వదంతులు వ్యాప్తి చేసే ఫేక్‌రాయుళ్ల తీరు మారడం లేదు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతుంటే... తమ సొంత ‘పాండిత్యాన్ని’ ఉపయోగించి మహమ్మారి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పాటించాల్సిన నిబంధనలు అంటూ సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి అనేక వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత పాటించాల్సిన నిబంధనల గురించి భారత వైద్య పరిశోధనా మండలి చేసిన సూచనలు అని పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెసేజ్‌ను ఫార్వార్డ్‌ చేశారు.(గుడ్‌ న్యూస్‌: జియో అదిరిపోయే ప్లాన్‌)

లాక్‌డౌన్‌ తర్వాత... ‘‘రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలి, ఏడాది పాటు బయటి ఫుడ్‌ తినకూడదు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకపోవడమే మంచిది.. సమావేశాలకు ఏడాదిపాటు దూరంగా ఉండాలి.. శాకాహారమే తీసుకోవాలి... బెల్టు, రింగులు, వాచ్‌, ధరించకూడదు. ఫోన్‌లోనే టైం చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి.. వాచ్‌ అనవసరం. హ్యాండ్‌ కర్చీఫ్‌ అవసరం లేదు. శానిటైజర్‌, టిష్యూ తీసుకువెళ్తే చాలు’’అంటూ ఇలా దాదాపు 21 రూల్స్‌తో ఆ మెసేజ్‌ను నింపి.. నెటిజన్లను ఆందోళనలో పడేశారు. ఇక ఈ నిబంధనలు నిజమా కాదా అన్న విషయంపై ఆల్ట్‌ న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ నిర్వహించగా... ఇదంతా అబద్ధమని తేలింది. ఈ విషయం గురించి ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రజనీకాంత్‌ను ప్రశ్నించగా.. సదరు వాట్సాప్‌ మెసేజ్‌ ఫేక్‌న్యూస్‌ అని కొట్టిపారేశారు. ఐసీఎంఆర్‌ కేవలం పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుందని.. అలాగే తమ వెబ్‌సైట్‌లో కూడా సమాచారాన్ని పొందుపరుస్తుందని స్పష్టం చేశారు. ‘‘నేషనల్‌ కమ్యూనిటీ బేస్డ్‌ సెరో-సర్వే ఫర్‌ కోవిడ్‌-19’’పేజ్‌ ద్వారా సమాచారం చెక్‌చేసుకోవచ్చని సూచించారు. (కొడుకు పెళ్లి.. ఫోన్‌లో తల్లిదండ్రుల దీవెనలు)

>
మరిన్ని వార్తలు