సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా లోతైన మాంద్యంలోకి వెళ్లిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. కరోనాతో దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడంతో వృద్ధిరేటు తగ్గునుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని, భారతదేశం వృద్ధి 2 సంవత్సరాలలో ఒక శాతం కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో భారత్ కూడా నెమ్మదిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్ బాగానే వ్యవహరించినప్పటికీ, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు నగదు బదిలీ, ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం అని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?)
గీతా గోపీనాథ్ పేర్కొన్న కొన్ని కీలక అంశాలు
కాగా చరిత్రలోనే తొలిసారిగా 2020లో అన్ని ప్రాంతాల్లో ప్రతికూల వృద్ధిరేటును అంచనా వేస్తున్నామని బుధవారం గీతా గోపీనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో కాస్త రికవరీ ఉన్నప్పటికీ చైనా వృద్ధిరేటును ఒక శాతంగా అంచనా వేశామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం తగ్గుతుందని, 1961 తర్వాత ఇదే అత్యంత తగ్గుదల అని ఆమె పేర్కొన్నారు. అయితే, 2021లో వృద్ధిరేటు 6 శాతానికి పుంజుకుంటుందన్నారు.