వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసి కూలర్‌ పెట్టారు

20 Jun, 2020 08:06 IST|Sakshi

కోట : రాజస్తాన్‌లోని కోటలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. సాకెట్‌లో నుంచి వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసి, ఎయిర్‌కూలర్‌ ప్లగ్‌ పెట్టడంతో ఒక రోగి మరణించాడు. వివరాలు..  కరోనా వైరస్‌ అనే అనుమానంతో ఒక 40 ఏళ్ల వ్యక్తిని రాజస్తాన్‌లోని మహారావు భీమ్‌ సింగ్‌ ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్‌ వార్డులో బాగా వేడిగా ఉండటంతో, రోగి కుటుంబ సభ్యులు బయటి నుంచి ఎయిర్‌ కూలర్‌ తీసుకువచ్చారు. కూలర్‌ను ఆన్‌ చేసేందుకు.. వెంటిలేటర్‌ కనెక్ట్‌ అయి ఉన్న సాకెట్‌లో వెంటిలేటర్‌కు సంబంధించిన ప్లగ్‌ను తీసి, కూలర్‌ ప్లగ్‌ను పెట్టారు. అరగంట తరువాత వెంటిలేటర్‌లో చార్జింగ్‌ అయిపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. పొరపాటున రోగి కుటుంబ సభ్యులే వెంటిలేటర్‌ ప్లగ్‌ను తీసేశారని ఎంబీఎస్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.(కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి)

అయితే ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో నెగెటివ్‌ అని తేలిందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో జూన్‌ 15న సదరు వ్యక్తిని ఐసీయూ నుంచి ఐసోలేషన్‌ వార్డుకు మార్చినట్లు వెల్లడించారు. ఇంతలోనే కుటుంబసభ్యుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, వారు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
 

మరిన్ని వార్తలు