కరోనా విజృంభణ: ఉలిక్కిపడ్డ మహారాష్ట్ర

22 May, 2020 20:27 IST|Sakshi

సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా వైరస్‌ మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాణాంతక వైరస్‌ ధాటికి దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణుకుతోంది. ముంబైవాసులను కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2940 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యియి. రాష్ట్రంలో వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడటం ఇది తొలిసారి. దీంతో మహారాష్ట్ర ఒక్కసారికి ఉలిక్కిపడింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 44,582కి చేరింది. (ఒక్కరోజే 6088 కరోనా కేసులు)

ఇక  ఆసియాలోనే అత్యంత మురికివాడల్లో  ఒకటైన ధారావిలో కరోనా భయాందోళన సృష్టిస్తోంది. శుక్రవారం కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మురికివాడలో మొత్తం కేసుల సంఖ్య 1478కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 1460కి పెరిగింది. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు భావిస్తున్నారు. ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. (శవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదు)

మరిన్ని వార్తలు