అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

24 Jul, 2019 17:58 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన ఎంఐఎం సభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరీంనగర్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్‌ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్‌ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్‌ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్‌ ప్రసంగించారు. 

మరిన్ని వార్తలు