‘కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం చేపట్టారు’

18 Feb, 2018 14:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లొచ్చినా సాధించింది మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆదివారం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. పోలవరం విషయంలో సెక్షన్ 90ని ఏపీ అమలు చేయడం లేదని తెలిపారు. ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టకును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని ఉందని స్పష్టం చేశారు..

కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు.. కానీ ఆయన సాధించింది మాత్రం శూన్యమని జైరాం రమేష్ విరుచుకుపడ్డారు. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఒక అవినీతి ప్రాజెక్టుగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తాడోపెడో తేల్చుకోవాలని జైరాం రమేష్‌ సూచించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని ఇటీవల విమర్శించిన జైరాం రమేష్.. రాష్ట్ర విభజన సమయంలో కడపలోని స్టీల్‌ ప్లాంట్‌, వైజాగ్‌లో పెట్రోలియం యునివర్శిటీ, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నట్లు మరోసారి గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు