సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి

30 Dec, 2017 07:21 IST|Sakshi

మాజీ ప్రధాని దేవెగౌడ

మైసూరు: కన్నడ భాష, నేల, నీటి విషయాల్లో పార్టీలకు అతీతంగా పోరడడానికి తాము ఎల్లపుడూ సిద్ధంగానే ఉన్నామని నదీ జలాల పంపిణీ వివాదంలో తమపై విమర్శలు చేసేటపుడు సీఎం సిద్దరామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. నీటి వివాదాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తుండిపోయామంటూ సీఎం సిద్దరామయ్య తమపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలన్నారు. కావేని నదీ జలాల పంపిణీ విషయంలో సీఎం సిద్దరామయ్య కోరిన ప్రతీసారీ రాష్ట్రం తరపున ఉద్యమాల్లో పాల్గొన్నామన్నారు. తాజాగా జరుగుతున్న మహదాయి నదీ జలాల పంపిణీ వివాదంపై కూడా పార్టీలకు అతీతంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

సీఎం సిద్దరామయ్య కోరితే మహదాయిపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించడానికి అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామన్నారు. తమపై విమర్శలు చేసే సమయంలో సీఎం సిద్దరామయ్య స్థితప్రగ్ఞతో వ్యవహరించాలని ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు విమర్శలు, ఆరోపణలు మానేసి నదీ జలాల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.తమపై విమర్శలు చేసే ముందు తాము కృష్ణ నది జలాలపై కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా పథకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇక గురువారం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో హాసన్‌ రైల్వేస్టేషన్‌ గురించి చర్చించడానికి మాత్రమే సమావేశమయ్యామని సమావేశంలో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగపట్టణం, మళవళ్లి, శ్రీరంగంలలో ఉన్న ఆదిరంగ, మధ్య రంగ, అంత్యరంగ దేవాలయాల్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు