ప్రేమ వేధింపులకు డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

21 Oct, 2016 11:45 IST|Sakshi
ములుగు: జయశంకర్ జిల్లా ములుగులో దారుణం చోటు చేసుకుంది. వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమ్య(19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాగా.. గత కొన్ని రోజులుగా అమర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అమర్‌కు ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అమర్ వేధింపులు ఎక్కువకావడంతో రమ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్ సాయంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు