శవయాత్రలో డిష్యుం డిష్యుం... గాలిలో కాల్పులు

29 Dec, 2014 18:07 IST|Sakshi
శవయాత్రలో డిష్యుం డిష్యుం... గాలిలో కాల్పులు

టీనగర్: అంతిమయాత్రలో జరిగిన ఘర్షణకు సంబంధించి నలభై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీ సులు గాలిలోకి కాల్పులు జరిపారు. 40 మందిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడకుండా భారీ పోలీసు భద్రత కల్పించారు. ఈ ఘటన తేనిలో చోటుచేసుకుంది. తేని జిల్లా ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమిళన్ (37). అవివాహితుడైన ఆయన బెంగళూరులో లా కోర్సు చదివారు.
 
 పరీక్షలు రాసేందుకు బెంగళూరుకు వెళ్లిన తమిళన్ తాను బసచేసిన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు తేనికి తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఊరేగింపుగా వెళ్లిన వారికి, మరో వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆ ప్రాంతం యుద్ధవాతావరణాన్ని తలపించింది.
 
 బొమ్మయ్‌గౌండన్‌పట్టికి చెందిన రామర్ (45) ట్రాక్టర్ నుంచి పడి తీవ్రంగా గాయపడి అతను మృతిచెందాడు. ఘర్షణలో అల్లినగరం, పల్లివోడై వీధికి చెందిన మలైసామి (35)  మృతిచెందాడు. విషయం తెలిసి జిల్లా ఎస్పీ మహేష్, పోలీసులను అక్కడికి చేరుకున్నారు. రాళ్లదాడికి పాల్పడిన వ్యక్తులపై లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు.
 
 ఆ తర్వాత అల్లినగరంలోను ఊరేగింపు జరుగుతుండగా రాళ్లదాడి జరిగింది. అక్కడ తెరచివున్న దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో ఎస్పీ మహేష్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. శవయాత్ర రత్నానగర్ చేరుకుంటుండగా అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
 
 ఆ సమయంలో జరిగిన రాళ ్లదాడిలో డీఎస్పీ శీనిసామి, ఇన్‌స్పెక్టర్ ఆరుముగం, సాయుధపోలీసు రమేష్ గాయపడ్డారు. అప్పటికీ సద్దుమణగక పోవడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దక్షిణ డివిజన్ ఐజీ అభయ్‌కుమార్, దిండుగల్ సర్కిల్ డీఐజీ అరివుసెల్వం, జిల్లా ఎస్పీ శరణన్ తేనికి చేరుకున్నారు. తేనీలో దుకాణాలను బంద్ చేశారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 40 మందిపై కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు