12 నుంచి జపాన్ చలనచిత్రోత్సవం

2 Dec, 2014 22:36 IST|Sakshi

ముంబై: ఈ నెల 12వ తేదీనుంచి నగరంలో జపాన్ చలనచిత్రోత్సవం తొలి ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరగనుంది. ఇందులోభాగంగా జపాన్ దేశానికి చెందిన పది సినిమాలను ప్రదర్శించనున్నారు. దీంతోపాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలనుకూడా నిర్వహించనున్నారు. జపాన్-భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు.  జపాన్‌కు చెందిన కె.హౌస్ ఆధ్వర్యంలో ఈ చలనచిత్రోత్సవం జరగనుంది.

ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంస్కృతి, ఆహారం, దుస్తులు, కళలు తదితరాల్లో భారత్, జపాన్ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. సినిమా అనేది ఆ దేశానికి చెందిన అన్ని కోణాలను కూడా ఆవిష్కరిస్తుంది. ఇరు దేశాల మధ్యసంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులోభాగంగానే భారత్‌లో జపాన్ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు