'ఒత్తిడులు, విమర్శలతో వెనక్కి తగ్గం'

10 Nov, 2016 19:30 IST|Sakshi
'ఒత్తిడులు, విమర్శలతో వెనక్కి తగ్గం'

నల్లగొండ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునే క్రమంలో జేఏసీగా భవిష్యత్‌లో మరింత క్రియాశీలకమవుతామని, ఈ క్రమంలో ఎన్ని ఒత్తిడులు, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలను నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళతామని ఆయన స్పష్టం చేశారు.

నల్లగొండ జిల్లాలో గురువారం జరిగిన జేఏసీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఎవరెన్ని మాటలు అన్నా వెనక్కు తగ్గేది లేదని.. సద్విమర్శలను స్వీకరిస్తామని, నిబద్ధతతో నిలబడి నిజాయితీగా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలతోనే అంతా అయిపోదని, అది కేవలం ఒక అంశం మాత్రమేనని, పౌరపాత్రను ఎన్నికల వరకే కుదించడానికి వీల్లేదని అంబేద్కర్ పదే పదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రజల తరఫున పనిచేసే సంస్థగా భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా, క్రియాశీలకంగా పనిచేస్తామని  కోదండరాం పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు