పది అడుగుల లోతుకు కుంగిన భవనం

7 Aug, 2017 03:50 IST|Sakshi
పది అడుగుల లోతుకు కుంగిన భవనం

తప్పిన ప్రమాదం
14 మంది రక్షింపు

అన్నానగర్‌:  రెండు అంతస్తుల భవనం కుంగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు 14 మంది స్వల్పగాయాలతో  బయటపడ్డారు. ఈ ఘటన అంబత్తూర్లో శనివారం చోటుచేసుకుంది. అంబత్తూరు వెంకటాపురం, మోనస్వామి మఠం వీధిలో  రెండు అంతస్తుల ప్రయివేటు భవనం ఉంది. ఈ భవనంలో ఆరు పోర్షన్లు ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చంద్రశేఖరన్‌(69) రిటైర్డ్‌ ఎల్‌ఐసీ ఉద్యోగి. ఇతని భార్య ఉమా(60). వీరి కుమారుడు విశ్వనాథన్‌(32), కోడలు భువన(30), మనవడు మనువరాలితో నివసిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం బంధువుల ఇంటికి విశ్వనా«థన్‌ కుటుంబంతో సహా వెళ్లారు. ఇంట్లో చంద్రశేఖర్, ఉమా ఉన్నారు. చంద్రశేఖర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో  7 గంటల సమయంలో నిద్రపోయాడు. ఉమా వంట చేస్తుండగా భవనం హఠాత్తుగా పది అడుగుల లోపలికి కుంగిపోయింది. వీరి కేకలు విని ఉమా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె కూడా పది అడుగుల గుంటలో పడి పోయింది.

వీరిద్దరి కేకలు విని మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వారు బిల్డింగు నుంచి వచ్చి చంద్రశేఖర్, ఉమ ఇద్దరు గుంటలో చిక్కుకుని ప్రాణాలకు పోరాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. తరువాత ఇద్దరిని నిచ్చెన వేసి సురక్షితంగా వెలుపలికి రప్పించారు. ఈ భవనంలో నివసిస్తున్న 14 మంది ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో భవనం నిర్మించిన స్థలం బావిలో ఉన్నట్లు తెలిసింది. బావిని సరిగ్గా మూయకపోవడంతో ఈ ప్రమాదం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు