ఈ-గవర్నెన్స్‌పై టీఎంసీ దృష్టి

8 May, 2014 23:26 IST|Sakshi
ఈ-గవర్నెన్స్‌పై టీఎంసీ దృష్టి

 ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సేవలను ఈ-గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఇందుకోసం ఇప్పటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది.  ఇప్పటికే ఈ-గవర్నెన్స్ ద్వారా అద్భుతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే ప్రజలకు ఈజీగా సేవలు అందించాలని నిర్ణయించిన టీఎంసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకోవచ్చని కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. కార్పొరేషన్‌లో అకౌంట్, ఎమర్జెన్సీ వ్యవస్థ, నీటి, ఆస్తి విభాగం, చెత్త విభాగం, హాకర్స్ వ్యవస్థాపన, ఆరోగ్య, జనన-మరణ, అగ్నిమాపక ఇలా అనేక విభాగాలను ఈ-గవర్నన్స్‌తో అనుసంధానం చేస్తామన్నాయి.
 ఫిర్యాదు కోసం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్......!!

 టీఎంసీ తరపున స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులు చేయవచ్చు. ఫోటోను అప్‌లోడ్ చేసుకోవచ్చు. తమ పరిసరాల్లో గుంతలు, డ్రైనేజీ లైన్లు, ఎక్కడైనా అక్రమంగా కట్టడాలు జరిగితే వాటి ఫొటోలను తీసి అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సకాలంలో ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. ఈ అప్లికేషన్ వల్ల ప్రజలు కార్పొరేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. రెండు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు