పాపం పసివాళ్లు!

22 Apr, 2020 08:18 IST|Sakshi

కరోనా కోరల్లో విలవిల

ఇప్పటి వరకు 75 మంది పిల్లలకు పాజిటివ్‌

ముగ్గురు గర్భిణులు..ఒక బాలింతకు కూడా

ఇప్పటికే ఇద్దరు మృతి...ఆందోళనలో తల్లిదండ్రులు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి పసి పిల్లలపై పంజా విసురుతోంది. గ్రేటర్‌లో ఇప్పటికే చాలా మంది పిల్లలకు పాజిటివ్‌వచ్చింది. వీరిలో ఇద్దరు ఏడాది వయసు లోపు పిల్లలుమృతి చెందారు. 14 ఏళ్లలోపు ఉన్న మరో 75 మంది చిన్నారులు కరోనాతో పోరాడుతున్నారు. 16 ఏళ్లలోపు వారు మరో 70 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. పిల్లలకు కరోనా సోకుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో మర్కజ్‌ కాంటాక్ట్‌ లేకున్నాన వైరస్‌ సోకడం గమనార్హం. ఇక పిల్లలు ఐసోలేషన్‌ వార్డుల్లోఒంటరిగా ఉండలేకపోతున్నారు. అమ్మా నాన్నలుకావాలంటూ మారాం చేస్తున్నారు. వీరికి తోడుగాఎవ్వరూ ఉండలేని పరిస్థితి. ఈ ఘటనలు బాధిత చిన్నారుల తల్లిదండ్రులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి.(బయటికొచ్చిన్రో.. వీపు లాఠీల మోతే!)

అసిఫ్‌నగర్‌ గంజేషాహి దర్గాకు చెందిన 11 నెలల బాలున్ని నెల 17న నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 19వ తేదీన బాలుడు మృతి చెందాడు. తీరా దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత వ్యాధి నిర్ధారణ
పరీక్షల రిపోర్టు వచ్చింది. కరోనా పాజిటివ్‌గా తేలింది.  
నారాయణపేట జిల్లాకు చెందిన 45 రోజుల శిశువు న్యుమోనియాతో బాధపడుతుండటంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి నుంచి ఈ నెల 15న నిలోఫర్‌కు రిఫర్‌ చేశారు. ఈఎస్‌ఆర్‌లో ఉంచి చికిత్సలు అందించారు. కరోనాగా అనుమానించి ఈ నెల 16న వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 17న రిపోర్టు రాగా..పాజిటివ్‌ అని తేలింది. ఆ వెంటనే శిశువును గాంధీకి రిఫర్‌ చేయగా, 18వ తేదీన మృతి చెందినట్లు తెలిసింది. 
కరోనా వైరస్‌ సోకి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 21 మంది మృత్యువాత పడగా, వీరిలో ఇద్దరు పసి పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల్లోనూ వైరస్‌ ఆలస్యంగాబయటపడుతోంది. ఇది తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

ముగ్గురు గర్భిణులు.. ఒక బాలింతకు కూడా..
పసిపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే ఇద్దరు ఏడాది లోపు పిల్లలు మృతి చెందగా, 14 ఏళ్లలోపు ఉన్న మరో 75 మంది పిల్లలు కరోనాతో బాధపడుతున్నారు. 16 ఏళ్లలోపు వారు మరో 70 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఏ ఒక్కరూ కూడా విదేశాలకు కానీ మర్కజ్‌కు కానీ వెళ్లిరాలేదు. కానీ అక్కడి నుంచి వచ్చిన వారి నుంచి వారి తల్లిదండ్రులకు, వారి నుంచి వారి పిల్లలకు వైరస్‌ సోకింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారిలో పెద్దలు, పిల్లలతో పాటు ముగ్గురు గర్భిణులు, ఒక బాలింత కూడా ఉంది. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. 

నర్సు ముద్దు చేయడంతో పాజిటివ్‌
ఇదిలా ఉంటే పెద్దల నిర్లక్ష్యానికి పిల్లలు బలిపశువులుగా మారుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నిమ్స్‌కు చెందిన ఓ నర్సు తన ఇంట్లోని మరో బాలుడిని ముద్దు చేయడంతో ఆమె నుంచి బాలునికి కరోనా సోకడంతో తల్లిదండ్రులతో పాటు ఆ ఇంట్లో ఉంటున్న వారందరినీ క్వారంటైన్‌ చేశారు. అదే విధంగా. మంగల్‌హాట్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కుమారుడు (16 నెలలు)జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో చికిత్స కోసం తల్లిదండ్రులు ఈ నెల 15న నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని గాంధీ ఆస్ప్రతికి తరలించారు. తల్లి పొత్తిళ్లలో ఆడుకో వాల్సిన నవజాత శిశువులు, ఇతర పిల్లలు ఒకరి తర్వాత మరొకరు వైరస్‌ బారిన పడి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తల్లులకు దూరంగా పిల్ల లు పీడియాట్రిక్‌ వార్డులో ఒంటరిగా ఉండలేక పోతున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి చూసి తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు