కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం

21 May, 2020 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి గురువారం లేఖ రాశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు)

దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఐసీఎంఆర్ నిబంధల ప్రకారమే కరోనా పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని వివరించారు. (24 గంటల్లో 132 మంది మృతి)

కాగా కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన ఫ్యాకేజీ అంతా అబద్ధమంటూ కేసీఆర్‌ విమర్శలు చేశారు. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తన చర్చ జరుగుతున్న క్రమంలోనే  కరోనా టెస్టులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. 


 

మరిన్ని వార్తలు