ఆరోగ్యపథం.. సంక్షేమ రథం

21 May, 2020 03:04 IST|Sakshi

నేడు కలెక్టర్లతో సీఎం కీలక సమావేశం

10 అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్‌

కరోనా కట్టడితోపాటే అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

భూముల ప్రక్షాళన, నియంత్రిత పంటల సాగే ప్రధాన ఎజెండా

వ్యవసాయేతర భూముల లెక్క తేల్చే దిశగా కీలక నిర్ణయం?

వర్షాకాలం.. అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: మూడు నెలలుగా కరోనా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వైపు మళ్లనుంది. వైరస్‌ కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే, ప్రగతి కార్యక్రమాలను పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణతోపాటు ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల అమలుపై ఆయన కలెక్టర్లకు సూచనలు చేసే దిశగా సమావేశపు ఎజెండాను ఖరారు చేశారు. (ప్రొఫెసర్‌ ఖాసీం విడుదల)

ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయంతో పాటు భూముల ప్రక్షాళన, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, భూసేకరణ, రుణమాఫీ, ఉపాధి హామీ పనులు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర పది అంశాలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.

సేద్యం..రైతులు..భూములు
కలెక్టర్లతో నేడు జరిగే సమావేశంలో నియంత్రిత వ్యవసాయం, భూముల ప్రక్షాళన, రైతు రుణమాఫీ అంశాలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత సాగు చేయాలి?, ఏ ప్రాంతంలో ఎలాంటి పంటల సాగుకు రైతులు అలవాటుపడ్డారు?, ఒకవేళ ఆ ప్రాంతంలో పంటమార్పిడి చేయాలనుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు ఆ దిశగా కౌన్సెలింగ్‌ ఎలా చేయాలనే విషయాలపై కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా నేటి సమావేశానికి వ్యవసాయ శాఖ, జిల్లా రైతుసమన్వయ కమిటీ అధ్యక్షులను కూడా ఆహ్వానించారు.

భూముల ప్రక్షాళన అంశంపై కేసీఆర్‌ ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములపై హక్కుల మార్పిడి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, వ్యవసాయ భూములుగా పేర్కొంటూ వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల లెక్కలు తేల్చనున్నారు. అలాగే ఇంకా రాష్ట్రంలో జరగాల్సిన భూసేకరణ, ప్రజలకు కనీస అవసరాల కల్పనలో (పట్టణ ప్రాంతాల్లో) భూముల లభ్యత, ఆహారశుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ గిడ్డంగులు, ఆగ్రి కాంప్లెక్సుల నిర్మాణానికి భూముల లభ్యతపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు.

తద్వారా రైతు సంబంధ పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేసేలా ఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే దానిపై కూడా కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీపై కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక బ్యాంకర్లతో సమావేశమై ఏ మేరకు మాఫీ జరిగిందన్న వివరాలు తీసుకురావాలని కలెక్టర్లకు సమాచారమందింది. ఇంకా ఉపాధిహామీ పథకం అమలు, పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల జారీ, పల్లె ప్రగతి అమలుపైనా సీఎం కలెక్టర్లతో చర్చించే వీలుంది.

సమావేశ ముఖ్యాంశాలు

  • రైతులకు రుణమాఫీ
  • కరోనా నియంత్రణ చర్యలు 
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు, అగ్రి కాంప్లెక్సులు, గోదాముల నిర్మాణానికి భూముల లభ్యత
  • ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములను సమగ్ర భూరికార్డుల నిర్వహణ విధానం (ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌)తో సరిపోల్చే అంశం
  • ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో
  • అన్ని ప్రభుత్వ ఆస్తుల మార్కింగ్‌
  • పంచాయతీల్లో లేఅవుట్లు,
  • ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విశ్లేషణ ద్వారా
  • వ్యవసాయేతర అవసరాలకు
  • వినియోగిస్తున్న భూముల గుర్తింపు, వాటిని ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో నవీకరణ
  • భూసేకరణ తప్పనిసరి అయిన
  • ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ
  • కార్యక్రమాల అమలు తీరు
  • పట్టణాల్లో ప్రజావసరాలకు
  • భూముల లభ్యత
  • ఉపాధి హామీ అమలు, జాబ్‌ కార్డులు, ఉపాధి పనుల కల్పన, పల్లె ప్రగతి
  • వర్షాకాలంలో
  • పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో
  • తీసుకోవాల్సిన చర్యలు
మరిన్ని వార్తలు