ఆర్టీసీలో కరోనా కలకలం

8 Jul, 2020 11:23 IST|Sakshi

మంచిర్యాల డిపోలో గ్యారేజీ ఉద్యోగికి పాజిటివ్‌

మూకుమ్మడి సెలవులకు ఇతర ఉద్యోగుల విన్నపం

డీఎం, వైద్యుడి  కౌన్సెలింగ్‌తో విధుల్లోకి

మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల ఆర్టీసీ డిపో గ్యారేజీలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కలకలం రేగింది. మంగళవారం విధులకు హాజరు కావడానికి తోటి ఉద్యోగులు తర్జనభర్జన పడ్డారు. ఉదయం 9గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉన్నా మధ్యాహ్నం వరకు కూడా విధుల్లో చేరలేదు. డిపో మేనేజర్‌ మల్లేశయ్య అక్కడి చేరుకోగా హోంక్వారంటైన్‌లో ఉండేందుకు పదిహేను రోజులపాటు మూకుమ్మడి సెలవులు ఇవ్వాలంటూ సెలవు పత్రాలు అందజేశారు. డీఎం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఒకేసారి ఉద్యోగులందరికి సెలవులు ఇవ్వడం కుదరదని జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న ఉద్యోగులకు సెలవులు ఇచ్చేందుకు సమ్మతించారు. ఆర్టీసీ వైద్యుడు జోగిందర్‌ కరోనాపై ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఉద్యోగులతో చర్చల అనంతరం 10 మందికి సెలవులకు అనుమతించగా మిగిలిన ఉద్యోగులు సెలవు పత్రాలు వెనక్కి తీసుకొని విధులకు హాజరయ్యారు అగ్ని మాపకశాఖ ఆధ్వర్యంలో డిపో ఆవరణలో హైపో క్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజేషన్‌ చేశారు. డీఎం మల్లేశయ్యతో విజిలెన్స్, సెక్యూరిటీ హెడ్‌కానిస్టేబుల్‌ సురేందర్‌రావు, ఎంఎఫ్‌ మధుసూధన్, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ శ్రీలత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు