సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. కరోనా కట్టడికి ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపులతోనే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతోందని వెల్లడించారు. గత 15 రోజుల నుంచి హైదరాబాద్లో రద్దీ పెరగడం.. జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజారోగ్య విభాగం డెరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగులు, వ్యాపారస్తులు మినహా కుటుంబసభ్యులు రోడ్లపైకి రావొద్దని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.