ఇలాగా..? సిల్లీగా!

4 Apr, 2020 07:24 IST|Sakshi
కేపీహెచ్‌బీ వద్ద రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ప్రశ్నిస్తున్న పోలీసులు

చిరు కారణాలతో విచ్చలవిడిగా రోడ్లపైకి

యథేచ్ఛగా లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు

అవసరం లేకున్నాబయటకు...

అడిగితే పొంతనలేని కారణాలు చెబుతున్న వైనం

కోవిడ్‌ వ్యాప్తిపై సీరియస్‌నెస్‌ నిల్‌

తలలు పట్టుకుంటున్న పోలీసులు

‘ఒకాయన జండు బామ్‌ అంటుండు. ఇంకొకాయన ఆశీర్వాద్‌ గోధుమ పిండి కోసం...మరొకరు...ఏడాది క్రితం నాటి మందుల చిట్టీ పట్టుకొస్తుండు...మా అక్కకు అన్నం లేదంట..ఇవ్వడానికి వెళ్తున్న అంటూ మరో యువకుడు చెబుతుండు. ఎందుకు రోడ్ల మీదికి వస్తున్నారని జనాన్ని ప్రశ్నిస్తే ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి...’అంటూ నగర పోలీసులు ఆవేదన వెళ్లగక్కారు. ‘మేం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే..ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. తలాతోకా లేని కారణాలతో రోడ్లపైకి వచ్చి కోవిడ్‌లాక్‌డౌన్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ‘కొంతమంది తప్పుడు స్టిక్కర్లు వాహనాలకు అంటించుకుంటున్నారు. ఆటోవాలాలు ప్రయాణికులనుఎక్కించుకుని..ఆస్పత్రికి వెళ్తున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారు’ అని కోవిడ్‌ విధుల్లో ఉన్న పలువురు పోలీసులు సాక్షి వద్ద వాపోయారు. శుక్రవారం నగరంలోని మూడు రూట్లలో (ఉప్పల్‌ టు గ్రీన్‌లాండ్స్, మియాపూర్‌ టుపంజగుట్ట, ఎల్‌బీనగర్‌ టు నాంపల్లి) ‘సాక్షి’ ప్రతినిధులు విజిట్‌ చేయగావిచ్చలవిడిగా జనం బయటకు రావడం కన్పించింది. మార్కెట్లు, రేషన్‌ షాపుల వద్ద మరీ ఎక్కువ రద్దీ నెలకొంది. నిలదీసిన పోలీసులకు పలువురు అబద్ధాలు చెప్పడం...దొంగదారిలో తప్పించుకోవడం వంటి సంఘటనలు సైతం వెలుగుచూశాయి.

సనత్‌నగర్‌/ఉప్పల్‌/హిమాయత్‌నగర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని బ్రేక్‌ చేయాలంటే లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే.. నిత్యవసర వస్తువుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తే సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిందే.. నివాసముండే పరిధి నుంచి మూడు కిలోమీటర్లు దాటి బయటకు వెళ్తే కేసులు నమోదు చేస్తామంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా చాలామంది ప్రజల్లో మార్పు రావడం లేదు. ఏవేవో సాకులు చెబుతూ రోడ్లపై ఎంజాయ్‌ చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పు, పంచదారా అంటూ కాలనీల్లోని రోడ్లపై కొంతమంది తిరుగుతుండగా.. మందుల చీటీలు పట్టుకొని మరికొందరూ దూరప్రాంతాలకు వెళ్తున్నారు. కొంతమంది పోకిరీలు నాలుగు వాటర్‌ బాటిళ్లు, నాలుగు ఫుడ్‌ ప్యాకెట్లు పెట్టుకొని సేవ పేరుతో బైకులకు స్టిక్కర్లు పెట్టుకొని ఊరంతా చక్కర్లుకొడుతున్నారు. కొందరు ఆటోవాలాలు మరో అడుగు ముందుకేసి ప్రయాణికులను ఆస్పత్రులకు తీసుకెళ్తున్నామంటూ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసుల చెకింగ్‌ పాయింట్లు ఎక్కడున్నాయోతెలుసుకొని సందులు, గొందులు దాటుకొని రోడ్లపైకి వెళ్తున్నారు. శ్రీనగర్‌కాలనీ నుంచిఖైరతాబాద్‌కు ఎందుకొచ్చావ్‌.. అంటే ఆశీర్వాద్‌ గోధుమ పిండి కోసం అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. పనీపాటా లేకుండా రోడ్లపైకి వస్తున్న వారు ఎలాంటి సాకులు చెబుతున్నారో తెలుసుకునేందుకు శుక్రవారం ‘సాక్షి’ విజిట్‌ నిర్వహించింది. మియాపూర్‌ టూ పంజాగుట్ట, ఎల్బీనగర్‌ టూ నాంపల్లి, ఉప్పల్‌ టూ గ్రీన్‌ల్యాండ్స్‌ వరకు పోలీసుల చెక్‌ పాయింట్ల వద్ద వివరాలు సేకరించింది. 

మియాపూర్‌ టూపంజాగుట్ట: వివిధ కారణాలతో రోడ్లపైకి వస్తున్న జనం
నా భార్య సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రసవం ఉంది. ఆమె దగ్గర ఉండేందుకు భానూర్‌ బీడీఎల్‌ నుంచి వెళ్తున్నాను. నా స్నేహితుడు బైక్‌పై మియాపూర్‌ వరకు దించేందుకు వచ్చాడు. అక్కడి నుంచి ఏదో ఒక వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి వెళ్లేందుకు ఇక్కడికి వచ్చాను.    – బిస్వాస్‌ సుమన్‌

బంధువుకు డెలివరీ డేట్‌ ఉంది
రేపోమాపో మా బంధువుకు ఒకామెకు డెలివరీ డేట్‌ ఇచ్చారు. బోయిన్‌పల్లిలో ఉండే ఆమె వద్ద భర్త తప్ప మరెవరూ లేరు. లింగంపల్లిలో ఉండే తమ వద్దకు తీసుకువచ్చేందుకు వాహనం తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడే ఏదో ఒక ఆస్పత్రిలో చేర్పిస్తాం.     –రవీందర్, బాలు

మా అబ్బాయికి సరుకులు ఇచ్చా..
బీరంగూడలో మా కుమారుడు, అతడి స్నేహితులు ఉంటారు. అక్కడే పనిచేసుకుంటూ అద్దెకు ఉంటున్నారు. బియ్యం, నిత్యావసర సరుకులు అయిపోయాయి. అందుకే నేరెడ్‌మెంట్‌లో ఉండే నేను వాటిని తీసుకుని ఇచ్చేసి వస్తున్నాను. అకౌంట్‌లో వేద్దామంటే తన వద్ద కూడా డబ్బులు లేవు.  –ప్రభాకర్, ఆటోడ్రైవర్‌

హాస్పిటల్‌లో బంధువులు 
కూకట్‌పల్లి ఓమ్నీ హాస్పిటల్‌లో మా బంధువులు చికిత్స పొందుతున్నారు. అయితే వైద్య చికిత్సల నిమిత్తం వారి దగ్గర డబ్బులు లేవు. అందుకే నేను ముత్తంగి నుంచి వారికి డబ్బులు ఇచ్చేందుకు వెళ్తున్నాను. డబ్బులు ఇచ్చేసి తిరిగి వెళ్లిపోతాను.    –నరేష్‌

రైల్వే టికెట్లు క్యాన్సిల్‌ కోసం..
ఊరికి వెళ్లేందుకు రైల్వే రిజర్వేషన్‌ చేయించుకున్నాం. అయితే రైళ్లు తిరగకపోవడంతో టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాలి. అందుకే టికెట్లు తీసుకుని రైల్వేరిజర్వేషన్‌ కౌంటర్‌కువెళ్లేందుకు లింగంపల్లిలో ఉండే తాము
కేపీహెచ్‌బీకి వచ్చాం.  – అప్పన్న

అబద్ధం చెప్పితప్పించుకుంటున్నారు..
చాలా వరకు మెడికల్‌ ఎమర్జెన్సీ స్టిక్కర్లతో బయటకు వస్తున్నారు. అలాంటి వారిని నిలువరిస్తున్నాం. కొందరు అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నారు. ఏవేవో సాకులు చెబుతూ రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటివి చాలా బాధాకరం.. ఇప్పటికే నాలుగు ఫోర్‌ వీలర్స్, 18 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశాం. మరికొందరికి జరిమానా విధించాం.      – సీహెచ్‌ రంగస్వామి, ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ 

ఉప్పల్‌ టు గ్రీన్‌ల్యాండ్‌
ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జెన్‌ప్యాక్ట్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో హబ్సిగూడ చౌరస్తా, మెట్టుగూడ,సికింద్రాబాద్‌ వైఎంసీఏ, బేగంపేట జంక్షన్, గ్రీన్‌ల్యాండ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌ పోస్టుల వద్ద నిత్యం రకరకాల కారణాలు చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. మెడికల్‌ ఎమర్జెన్సీ పేరుతో దాదాపుగా 50  మంది స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. 

ఎన్నో కారణాలు చెబుతున్నారు
చాలా వరకు అత్యవసరం అంటూ సాకులు చెబుతున్నారు. ఎక్కువగా మెడికల్‌ చెకప్‌ అంటున్నారు. కూరగాయలు.. రేషన్‌ బియ్యం.. చావులు, దినాలంటూ.. రకరకాలుగా నిత్యం అనేక కారణాలు చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతులిచ్చిన ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు వారిలో లేదు.– ఎన్‌ఎల్‌ఎన్‌ రాజు, ఏసీపీ, మల్కాజిగిరి ట్రాఫిక్‌   

ఒకే వాహనంలో 50 మంది...  
సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా వద్ద ఒకే వాహనంలో దాదాపు 50 మందికి పైగా మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు నిలిపేశారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా జీహెచ్‌ఎంసీ అధికారులు తమను తీసుకురావాలన్నారని చెప్పారు. ఒకే వాహనంలో మాస్కులు లేకుండా ఇంతమంది ప్రయాణించడం ప్రమాదకరం.  

జిందాతిలస్మాత్‌ లేదట..
కొంతమంది వివిధ కారణాలు చెప్పి బయటకు వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒకరి బైక్‌ను ఆపి లాక్‌డౌన్‌ కదా ఎందుకయ్యా బయటకు వచ్చావ్‌? అన్నాను. సార్‌.. జిందాతిలస్మాత్‌ తెచ్చుకోవడానికి వెళ్తున్నా అన్నాడు. అదేరోజు మరో నలుగురు జండుబామ్‌ కారణం చెప్పారు. అందుకే బైక్‌లను తక్షణం సీజ్‌ చేసేస్తున్నాం.– కె.సైదులు, ఎస్సై, నారాయణగూడ.

మెడికల్‌షాప్‌ అంటూ..
చాలామంది మెడికల్‌ షాప్‌ పేరుతో బయటకు వస్తున్నారు. వారిని క్షుణ్ణంగా విచారిస్తే వారి వద్ద ఏ విధమైన ప్రిస్క్రిప్షన్‌ ఉండదు. ఎందుకయ్యా ఇలా వచ్చావ్‌ అంటే నా మైండ్‌లో ఉన్నాయి సార్‌.. ట్యాబ్లెట్స్‌ నేమ్స్‌ వెళ్లి తెచ్చుకుంటా అంటారు. ఇలా పనికిమాలిన కారణాలు చెబుతున్నారు.– ఎస్‌.లింగయ్య,ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్, కొత్తపేట.

ఉల్లిగడ్డల కోసం
నిన్ననే మా కానిస్టేబుల్‌ ఒకర్ని ఆపారు. ఎక్కడకి బ్రదర్‌ అని అడిగారు. చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నావ్‌ ఇదేం పద్ధతి అన్నాను. అతను వెంటనే సార్‌.. వనస్థలిపురంలో కేజీ ఉల్లిగడ్డ దొరకట్లేదు అందుకే మలక్‌పేట్‌గంజ్‌కు వెళ్తున్నా.. అన్నాడు. బైక్‌ సీజ్‌ చేసి వెనక్కి పంపాను.    – టి.రాజశేఖర్‌రెడ్డి, మలక్‌పేటట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్, దిల్‌షుక్‌నగర్‌.

కూరగాయల సాకుతో తిరుగుతున్నారు
పదే పదే వస్తున్న వాహనాల్లో ఎక్కువ మంది కూరగాయల పేర్లు చెబుతున్నారు. సరే కదా.. అని వదిలేస్తే.. రిటర్న్‌లో వాళ్లు కూరగాయలు తీసుకెళ్లకుండా ఖాళీగా వెళ్తున్నారు. అటువంటి వారిని గుర్తించి రిటర్న్‌లో పట్టుకుని మరీ బైక్‌లను సీజ్‌ చేస్తున్నాం. ఇలా సిల్లీ రీజన్స్‌తో బయటకు వస్తున్నందుకు బాధగా ఉంది.    – ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి, చాదర్‌ఘట్‌ ఎస్సై, నల్లగొండ క్రాస్‌రోడ్‌. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు