కోటి బతుకమ్మ చీరల పంపిణీ : కేటీఆర్‌

19 Sep, 2019 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 23 నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. 10 లక్షల వరకు 9 మీటర్ల చీరలు.. 6 మీటర్లతో 90 లక్షల చీరలు తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక బతుకమ్మ చీరలు మార్కెట్లో సైతం దొరికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 



రాష్ర్టంలోని కోటి మంది మహిళలకు చిరు కానుక అందివ్వనున్నామని, ద్విముఖ వ్యూహంతో కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.  వీటి తయారీ కోసం 24 వేల మగ్గాలు పనిచేశాయని, 18 ఏళ్ళు పై పడ్డ మహిళలు అందరికి పంపిణీ బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇస్తున్నామని, వీటి పంపిణీ గ్రామ స్థాయిలో, పట్టణాల్లో.. వార్డు స్థాయిలో చేయనున్నట్లు తెలిపారు. 10 రకాల రంగులు, 10 రకాల డిజైన్లతో 100 కాంబినేషన్లో పంపిణీ చేస్తున్నామని, 710 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలకు ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. 23 నుంచి సాధ్యమైనంత వేగంగా పంపిణీ చేస్తామని, ఇతర రాష్ట్రాలకు మన చీరలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.  వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరలు ఓ బ్రాండ్‌ కాబోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు