‘నో మాస్క్‌–నో సేల్‌’

1 May, 2020 13:07 IST|Sakshi
భూదాన్‌పోచంపల్లిలో కిరాణ షాపు వద్ద ఏర్పాటు చేసిన నో మాస్క్‌– నో సేల్‌ ఫ్లెక్సీ

పోచంపల్లి మున్సిపాలిటీలో వినూత్న కార్యక్రమం

మాస్క్‌ ధరించినవారికే సరుకులు

దుకాణాల వద్ద నో మాస్క్‌     – నో సేల్‌ ఫ్లెక్సీల ఏర్పాటు

22వేల మందికి ఉచితంగా మాస్క్‌ల పంపిణీ

భూదాన్‌పోచంపల్లి : కరోనా మహమ్మారి కట్టడికి భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో అధికారులు ‘నోమాస్క్‌– నో సేల్‌’ నినాదంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను చైతన్యం చేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అంతేకాక మున్సిపాలిటీ పరిధిలో లైసెన్స్‌ పొందిన 50 కిరాణం, మెడికల్‌ షాపులు, చికెన్, మటన్‌ షాపులకు ‘నో మాస్క్‌–నో సేల్‌’ అనే ఫ్లెక్సీలను మున్సిపల్‌ అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. అనతికాలంలోనే ఈ వినూత్న కార్యక్రమం మంచి సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

మాస్కు లేకుంటే సరుకులు లేవు
మాస్కులు ధరించకుండా దుకాణానికి వచ్చే వినియోగదారులకు సరుకులు ఇవ్వవద్దని ఆయా షాపు యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దాంతో ప్రతి షాపు యజమాని అధికారుల ఆదేశాలను పాటిస్తూ, వినియోగదారులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.

ఉచితంగా 22వేల మాస్కుల పంపిణీ
పోచంపల్లితో పాటు మున్సిపాలిటీ పరిధిలో రేవనపల్లి, ముక్తాపూర్‌ గ్రామాల్లో 22వేల జనాభాకు సరిపడా మాస్కులను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయించారు. వీటిని ప్రతి ఒక్కరూ ధరించేలా ఇంటింటికి ఉచితంగా  పంపిణీ చేశారు.

సత్ఫలితాలు వస్తున్నాయి
మున్సిపాలిటీ పరిధిలో నో మాస్క్‌–నో సేల్‌ అనే కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం మంచి ఫలి తాలు ఇస్తుంది. ప్రజలందరికీ ఉచితంగా మాస్కు లను పంపిణీ చేస్తున్నాం. అంతేకాక నో మా స్క్‌–నోసేల్‌ ఫ్లెక్సీలను షాపుల వద్ద ఏర్పాటు చేయించాం. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు, షాపు యజమానులు సహకరిస్తున్నారు.
–బాలశంకర్, మున్సిపల్‌ కమిషనర్,పోచంపల్లి

మరిన్ని వార్తలు