చెత్తకుప్పలో పీపీఈ కిట్‌

15 Jul, 2020 07:26 IST|Sakshi
తాండూరు పట్టణంలో చెత్త కుప్పలో ఉన్న పీపీఈ కిట్‌

తాండూరులో కలకలం

తాండూరు టౌన్‌: పీపీఈ కిట్‌ చెత్తకుప్పలో కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులు లేదా వారికి చికిత్స అందించే వైద్యులు ధరించాల్సిన పీపీఈ కిట్‌ తాండూరులో జనావాసాల మధ్య చెత్తకుప్పలో కనిపించడంతో కలవరానికి గురయ్యారు. మంగళవారం తాండూరు పట్టణంలోని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగారం నర్సింలు కాంపౌండ్‌ సమీపంలోని ఓ చెత్త కుప్పలో స్థానికులు పీపీఈ కిట్‌ను గుర్తించారు. వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లిఖార్జునస్వామికి సమాచారం అందజేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు మున్సిపల్‌ కార్మికుల సహాయంతో పీపీఈ కిట్‌ను తొలగించారు. అయితే, పీపీఓ కిట్‌ను అక్కడ ఎవరు పడేశారనే విషయం తెలియరాలేదు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో గుర్తించడం వీలుపడలేదు. ప్రైవేటు ఆస్పత్రి లేదా ల్యాబొరేటరీ వారు పీపీఈ కిట్‌ను వినియోగించి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల పట్టణంలోని పలువురు కరోనా పాజిటివ్‌ బారినపడినప్పటికీ విషయం బయటకు పొక్కకుండా ఇళ్లల్లోనే చికిత్స తీసుకుంటున్నారని, వారిని గుర్తించి ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించాలని ఈ సందర్భంగా పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు