మరో ఆరుగురికి పాజిటివ్‌

14 May, 2020 12:23 IST|Sakshi
కుటుంబీకులను అంబులెన్స్‌లో ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యాధికారులు

అంతా ముంబై నుంచి వచ్చిన వారే..

ఐసోలేషన్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలింపు

గ్రామాల్లో ఊపందుకున్న పారిశుధ్య చర్యలు

బెల్లంపల్లి/దండేపల్లి/మంచిర్యాలరూరల్‌: జిల్లాలో కరోనా వైరస్‌ క్రమంగా కోరలు చాస్తోంది. ఇప్పటికే ముంబై నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు పాజి టివ్‌ రాగా తాజాగా బుధవారం మరో ఆరుగురికి కరోనా సోకడం సంచలనమైంది. ఆ ఆరుగురు వ్య క్తులు కూడా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వారుగా అధికారులు గుర్తించారు. కరోనా వచ్చిన ఆరుగురు వ్యక్తుల్లో ఒకరు హాజీపూర్‌ గ్రామ వాసి కాగా, ముగ్గురు హాజీపూర్‌ మండలం రాపల్లి గ్రామానికి చెందిన వారని, మరో ఇద్దరు దండేపల్లి మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన వారుగా ప్రకటించారు.

బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉన్న ఎనిమిది మంది నుంచి మంగళవారం శాంపిళ్లు సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు  పరీక్ష కోసం పంపారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు ని ర్ధారణ కాగా మిగిలిన ఇద్దరికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చి నట్లు బెల్లంపల్లి ఐసోలేషన్‌ వార్డు ఇన్‌చార్జి డాక్టర్‌ కె.కుమారస్వామి తెలిపారు. నెగిటివ్‌ వచ్చిన వారి లో తాండూర్‌ మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ఉండగా, హాజీపూర్‌కు చెందిన మ రో వ్యక్తి ఉన్నారు.  ఇదిలా ఉండగా ఈపాటికే ముంబై నుంచి స్వగ్రామానికి వచ్చిన ముగ్గురు రాపల్లి వాసులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా  పాజిటివ్‌తో మృతి చెందడం కలకలం సృష్టించింది.

వలస వస్తున్న కరోనా
మహారాష్ట్ర నుంచి స్వగ్రామాలకు వలస వస్తున్న వారితో జిల్లాలో కరోనా వైరస్‌ ప్రబలుతోంది. కొన్నాళ్ల క్రితం బతుకు దెరువును వెతుక్కుంటూ మహారాష్ట్రకు వెళ్లిన వ్యక్తులు ప్రస్తుతం కరోనా వ్యాప్తితో క్రమంగా ఇంటిదారి పడుతున్నారు. ఆ తీరుగా దండేపల్లి, హాజీపూర్‌ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల వ్యక్తులు వస్తుండటంతో వీరిని ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగానే పసిగట్టి అనుమానంతో బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు పంపిస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డులో చేరిన సదరు వ్యక్తుల నుంచి శాంపిల్స్‌ను రిపోర్టుకు పంపిస్తుండటంతో కరోనా పాజిటివ్‌ కేసులు బయట పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చెన్నూర్‌ ఘటన మినహా మిగిలిన పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వ్యక్తులంతా వలసవాదులుగా అధికారులు ప్రకటిస్తున్నారు. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులుగా నమోదు చేస్తున్నారు. ఆ తీరుగా పరిశీలించినట్‌లైతే ఇప్పటి వరకు కాస్త నయంగానే కనిపిస్తున్నా.. జిల్లా వాసుల  మదిని భయాందోళనలు తీవ్రంగా వెంటాడుతున్నాయి.

ఐసోలేషన్‌ వార్డుకు 14 మంది
ప్రస్తుతం కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన హాజీపూర్, దండేపల్లి మండలాలకు చెందిన వ్యక్తుల గ్రామాల నుంచి ముందస్తు జాగ్రత్తగా బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి ఆయా మండలాల నుంచి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కుటుంబీకులు ఇతర వ్యక్తులు 14 మందిని ఐసోలేషన్‌ వార్డుకు ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. ఇంకా మరి కొందరిని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఐసోలేషన్‌ వార్డుకు తెచ్చిన వ్యక్తులంతా స్థానికులే అయినా ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా కరోనా వైరస్‌ కట్టడి కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తోంది.

రాపల్లి, హాజీపూర్‌లలో ప్రత్యేక చర్యలు
హాజీపూర్‌ మండలంలోని రాపల్లి, హాజీపూర్‌లో పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టారు. మంచిర్యాలరూరల్‌ సీఐ కృష్ణకుమార్, హాజీపూర్‌ ఎస్సై చంద్రశేఖర్, ఎంపీడీఓ అబ్దుల్‌హై ఎంపీఓ శంకర్, సర్పంచులు ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లోని వీధుల్లో పెద్ద ఎత్తున సోడియం హైపోక్లోరైడ్‌తోపాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.

ఇటిక్యాల వాసికి కూడా..
లక్సెట్టిపేట: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన వలస కూలీకి కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు స్థానిక వైద్యాధికారి ప్రసాద్‌ తెలిపారు. ముంబైలో కూలీ పనులు చేసుకుంటున్న వెల్గటూరు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, ధర్మపురి మండలం ఆరెపల్లికి చెందిన ఒకరు, జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన ఒకరు, ఇటిక్యాలకు చెందిన మరొకరు ముంబై నుంచి వచ్చారు. బుధవారం జగిత్యాల పట్టణానికి చేరుకోవడంతో వారి వాహనాలను ఆపి అధికారులు పరీక్షలు చేయగా ఇటిక్యాలకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు