స్వామివారి ఆదాయం 14, ఖర్చు 11

30 Mar, 2017 03:14 IST|Sakshi
స్వామివారి ఆదాయం 14, ఖర్చు 11

- అమ్మవారి ఆదాయం 14 , ఖర్చు 2
- ఘనంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి పంచాంగ శ్రవణం


యాదగిరికొండ: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనారసింహ స్వామి దేవస్థానంలో బుధవారం హేవళంబినామ సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగను, పంచాంగ శ్రవణాన్ని అర్చకులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిది స్వాతి నక్షత్రం తులారాశి 14 ఆదాయం, 11 ఖర్చు, ఆండాళు అమ్మవారిది పుబ్బ నక్షత్రం సింహరాశి 14 ఆదాయం, 2 ఖర్చుగా వచ్చిందని పురోహితులు తెలిపారు. ఈ ఏడాది అందరికీ కాలం కలిసి వస్తుందన్నారు.

పంటలు సమృద్ధిగా పండి రైతులు ధాన్యరాశులను ధనరాశులుగా పోస్తారని పేర్కొన్నారు. వర్షాకాలంలో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి పొర్లి జలపాతాలను తలపిస్తాయన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయం పూర్తవుతుందనీ, ఈ ఏడాది స్వామి, అమ్మవార్ల ఉత్సవాలన్నీ కొత్త ఆలయంలోనే జరుపుకొంటామని జోస్యం చెప్పారు. దేవస్థానం ఖజానా నిండుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతారని, ప్రజానీకం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నలుగురు వేద పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కలెక్టర్‌ అనితా రాంచంద్రన్, దేవస్థానం చైర్మన్‌ బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, అర్చకులు నల్లందీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కరశర్మ, చలమాచార్యులు, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు