AP: లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బీసీ సంఘం మద్దతు

4 Jan, 2024 13:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏపీ బీసీ సంఘం మద్దతు తెలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం ప్రకటించింది. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.. సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ప్రజల జీవితాలను బాగుచేస్తున్నారన్నారు. ఆయన పాలనలో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని తెలిపారు. 

గత పాలకులు ఓట్ల సమయంలో డబ్బులు, మద్యం, తినడానికి రేషన్‌ ఇచ్చి చేతులు దులుపుకునే వారని విమర్శించారు.  చంద్రబాబు 14 ఏళ్లు పాలించి బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు. ‘బీసీల పిల్లలు ఫీజులు కట్టడానికి రక్తం అమ్ముకున్నారు. సీఎం జగన్ అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి అనేక పధకాలు పెట్టి బీసీల బిడ్డలను చదివిస్తున్నారు. జగన్ పాలనలో మా బతుకులు మారాయి. ఖబడ్డార్ ప్రతిపక్ష పార్టీలు. మీ మోసాలు మాకు తెలిశాయి. ఇన్నేళ్లు మమ్మల్ని మోసం చేశారు. డబ్బు, నోరు, శక్తి, పేరు లేనినవాళ్ళకి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ 

వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి. ఇతర రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి బాలేదు. ఇంకా అక్కడ హాస్టళ్లు, గురుకులాలు, తిండి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడి బీసీలు విమానాలు ఎక్కుతున్నారు.. కార్లలో తిరుగుతున్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్య, హోదా ఇస్తున్నారు. ప్రతిపక్షాల మోసపు మాటలు నమ్మవద్దు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు.. బీసీల గెలుపు’ అని ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్‌ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్‌ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్‌ కల్యాణ్‌ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. 6 కి.మీ లు వెళ్లి పెన్షన్‌ తెచ్చుకునే పరిస్థితి కావాలా? ఉదయం 6 గంటలకు పెన్షన్‌ ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే పరిస్థితి కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు.

చదవండి: కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి

>
మరిన్ని వార్తలు