కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

28 Jul, 2021 15:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలి. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.

అనంతరం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షలో.. ‘‘100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. కొత్త మెడికల్‌ కాలేజీల కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలి. వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. మే, జూన్‌, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని  అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... 
‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్‌ట్రేటర్లు, డీ–టైప్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.  జిల్లాల వారీగా నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అవసరమైన శిక్షణనూ వీరికి అందించాలి.  ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. శిక్షణ అనంతరం వీరిని ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కు అప్పగించాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

అదే విధంగా... ‘‘ఐటీఐ, డిప్లమోలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా... ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అంతేగాక చాలామందికి ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం జగన్‌ అన్నారు. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల ఏర్పాటుపైనా సీఎం సమీక్ష

  • ముందుగా 100 పడకల ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశం
  • ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి ప్రభుత్వం తరపున 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్న సీఎం
  • పవర్‌ ఛార్జీల్లో కూడా ఊరటనిస్తున్నాం

వ్యాక్సినేషన్‌ 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం జగన్‌ వీలైనంత త్వరగా వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న సీఎం జగన్‌.. ఈ విషయంపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.

వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్‌ అనంతరం అక్కడి కోవిడ్‌ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 
ఇందుకోసం ఒక కమిటీని నియమించాలన్నారు. ‘‘ఈ అంశాలపై కమిటీ అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలి. తద్వారా కోవిడ్‌ నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

కొత్త మెడికల్‌ కళాశాల పనులపైనా సమీక్ష నిర్వహించిన సీఎం

  • నూతన మెడికల్‌ కళాశాలల కోసం పెండింగ్‌ ఉన్న చోట భూసేకరణను పూర్తి చేయాలని సీఎం ఆదేశం
  • కొత్త మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోగా తనకు నివేదిక ఇవ్వాలన్న సీఎం
  • 16 కాలేజీల పనులపై పూర్తి వివరాలు అందించాలి. ఒకవేళ పనులు మొదలు కాకపోతే.... వెంటనే పనులు మొదలుపెట్టించి ఆ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వండి. నాడు–నేడు వైద్యఆరోగ్యశాఖలో పనులపైనా ప్రజంటేషన్‌ ఇవ్వాలి 

కోవిడ్‌- 19 నివారణ, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు

  • రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన యాక్టివ్‌ కేసులు
  • ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 20,965 
  • డెయిలీ పాజిటివిటీ రేటు 2.51 శాతం
  • రికవరీ రేటు 98.25 శాతం
  • పాజిటివిటీ రేటు 3 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 9
  • పాజిటివిటీ రేటు 5 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 3
  • పాజిటివిటీ రేటు 5 కంటే ఎక్కువ ఉన్న జిల్లా 1 
  • ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారు 4426
  • కోవిడ్‌ కేర్‌ సెంటర్లులో ఉన్న వారు 2349 
  • నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్లు 94.33 శాతం
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో  ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్లు  75.25 శాతం
  • 104 కాల్‌ సెంటర్‌కి వచ్చిన కాల్స్‌ 933 

వ్యాక్సినేషన్‌ గురించి

  • రాష్ట్రంలో 2,04,17,764 డోసుల వ్యాక్సిన్లు పూర్తి
  • సింగిల్‌ డోసు కింద 1,03,24,702 మందికి వ్యాక్సినేషన్‌
  • 50,46,531 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌
  • మొత్తం 1,53,71,233 మందికి వ్యాక్సినేషన్‌

ఈ సమీక్షా సమావేశంలో... ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని),  డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్టబాబు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు