ఒంగోలు కోవిడ్ కేర్ సెంటర్లో రుచికరమైన వంటకాలు
బాధితులకు అందించే భోజనంలో రాజీ మాటే లేదు
ఇక్కడ చేరినవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు
ఆదర్శంగా నిలుస్తున్న ఒంగోలు కోవిడ్ కేర్ సెంటర్
ఒంగోలు టౌన్: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఈ రెండింటిని పాటిస్తే రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండూ ఒంగోలులోని పాత ట్రిపుల్ ఐటీ కాలేజీలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటున్న కరోనా బాధితులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ మొత్తం 500 పడకలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు కలిగి ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు అవకాశం లేనివారిని ఇక్కడ ఉంచుతున్నారు.
ప్రస్తుతం 170 మంది ఈ సెంటర్లో ఉంటున్నారు. వారందరి ఆరోగ్యాన్ని చూసేందుకు 24/7 కింద వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. అదే సమయంలో వారు మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉండేందుకు ఉపశమన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. భోజన తయారీలో నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నారు. దాంతో రుచికరమైన భోజనాన్ని ఆహారంగా తీసుకుంటూ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు.
మెనూ అదుర్స్
మెనూలో రాజీ పడేది లేదు
పాత ట్రిపుల్ ఐటీ కాలేజీలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఉండేవారికి అందించే మెనూ విషయంలో రాజీ పడేది లేదు. ఇక్కడకు వచ్చేవారికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఆహారం కూడా అంతే ముఖ్యంగా భావించి వాటిని తయారు చేయిస్తున్నాం. కలెక్టర్ పోల భాస్కర్ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. ఇక్కడ ఉండేవారి అభిప్రాయాలను కూడా తీసుకొని వారికి అనుగుణంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. ఇక్కడకు వచ్చినవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెనుదిరుగుతున్నారంటే అందులో ఇక్కడ అందించే భోజనం ముఖ్య భూమిక పోషిస్తోంది.
– ఉపేంద్ర, సెంటర్ నోడల్ అధికారి